ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సైన్యం దెబ్బకు.. పాకిస్థాన్ రాజ్యాంగంలో మార్పులు చేసింది,,,: సీడీఎస్ జనరల్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 09:36 PM

భారత సైన్యం పరాక్రమం ధాటికి పాకిస్థాన్ తన రక్షణ వ్యవస్థనే మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుణెలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో ఆయన మాట్లాడుతూ.. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సృష్టించిన ప్రభావం వల్ల పాకిస్థాన్ హడావిడిగా తన రాజ్యాంగానికి సవరణలు చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది భారత్ సాధించిన వ్యూహాత్మక విజయానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.


రాజ్యాంగ సవరణలు.. బలహీనతకు నిదర్శనం


ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ రక్షణ వ్యవస్థలోని లోపాలను గుర్తించిన పాకిస్థాన్.. తమ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ని సవరించిందని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. ము‌ఖ్యంగా తమ దేశంలోని 'హయ్యర్ డిఫెన్స్ ఆర్గనైజేషన్'లో భారీ మార్పులు చేసిందని ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌లో తాము దెబ్బతిన్నామనే నిజాన్ని పాకిస్థాన్ పరోక్షంగా ఈ రాజ్యాంగ సవరణల ద్వారా అంగీకరించిందని జనరల్ అనిల్ చౌహాన్ ఎద్దేవా చేశారు.


గతంలో ఉన్న 'చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ' పదవిని పాకిస్థాన్ రద్దు చేసి.. దాని స్థానంలో 'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్' (CDF) అనే కొత్త పోస్టును సృష్టించినట్లు సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. అయితే ఈ సీడీఎఫ్ పదవిని ఆర్మీ చీఫ్ మాత్రమే సృష్టించగలరని నిబంధన పెట్టడం ద్వారా.. ఉమ్మడి రక్షణ వ్యవస్థ అనే ప్రాథమిక సూత్రానికే పాక్ తూట్లు పొడిచిందని ఆయన విమర్శించారు. ఇది మాత్రమే కాకుండా కొత్తగా 'నేషనల్ స్ట్రాటజీ కమాండ్', 'ఆర్మీ రాకెట్ ఫోర్సెస్ కమాండ్'లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ దేశం కేవలం సైన్యం చేతిలోనే అధికారాన్ని కేంద్రీకరిస్తోందని.. ఇది వారి 'లాండ్ సెంట్రిక్' ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.


మరోవైపు భారత సైన్యంలో తీసుకు రావాలని భావిస్తున్న 'జాయింట్ థియేటర్ కమాండ్ల' ప్రక్రియ తుది దశకు చేరుకుందని జనరల్ చౌహాన్ తెలిపారు. 2026 మే 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికీ.. దానికి ముందే పూర్తిస్థాయి నిర్మాణం సిద్ధం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఉరి సర్జికల్ స్ట్రైక్స్, డోక్లాం, గల్వాన్ ఉదంతాలు, బాలకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో.. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఒక స్థిరమైన రక్షణ వ్యవస్థను భారత్ నిర్మిస్తోందని ఆయన స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa