ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌లో పంట చేనులోనే హిందూ రైతును కాల్చి చంపిన భూస్వామి

international |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 11:12 PM

దాయాది దేశం పాకిస్థాన్‌లో హిందూ మైనారిటీల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సింధ్ ప్రావిన్స్‌లో ఒక భూస్వామి అహంకారం ఒక నిరుపేద హిందూ రైతు ప్రాణాలను బలితీసుకుంది. కైలాష్ కోహ్లీ అనే హిందూ రైతును సర్ఫరాజ్ నిజామాని అనే భూస్వామి దారుణంగా కాల్చి చంపిన ఉదంతం ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.


స్థానిక నివేదికల ప్రకారం.. భూస్వామి సర్ఫరాజ్ నిజామాని తన వద్ద భూమి కౌలుకు తీసుకున్న కైలాష్ కోహ్లీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తాజాగా సర్ఫరాజ్ నిజామాని.. కైలాష్ కోహ్లీపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. కైలాష్ గుండెల్లోకి నేరుగా కాల్పులు జరపడంతో.. అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే ఈ హత్యకు దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం భూమి వివాదమా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.


 ఈ కిరాతక హత్య వార్త దావాగ్నిలా వ్యాపించడంతో హిందూ మైనారిటీ సంఘాలు, మానవ హక్కుల గ్రూపులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చాయి. సింధ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం, స్థానిక యంత్రాంగానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతనిపై హత్య, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. "ఇది కేవలం ఒక వ్యక్తి హత్య కాదని.. మానవత్వంపై జరిగిన దాడి" అని పాకిస్థాన్ దరావర్ ఇత్తెహాద్ చైర్మన్ శివ కచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


పాక్ ద్వంద్వ నీతిపై భారత్ ఆగ్రహం


ఈ ఘటన పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఇటీవల ఢిల్లీలోని తుర్క్‌మాన్ గేట్ వద్ద జరిగిన ఆక్రమణల తొలగింపుపై భారత్‌కు నీతులు చెప్పిన పాక్ విదేశాంగ మంత్రికి.. భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సొంత దేశంలో మైనారిటీలను క్రూరంగా హింసిస్తూ, భారత్‌ను విమర్శించే హక్కు పాకిస్థాన్‌కు లేదని భారత విదేశాంగ శాఖ (MEA) తెలిపింది. పాకిస్థాన్ తన గతాన్ని చూసుకోవాలని, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులు జగమెరిగిన సత్యమని ఎద్దేవా చేసింది.


ప్రస్తుతం సింధ్ ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కైలాష్ కోహ్లీ రక్తానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని మైనారిటీ సంఘాలు హెచ్చరించాయి. మైనారిటీల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పాక్ ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa