ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా పెరిగిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు,,,,వీసా దరఖాస్తుదారులకు అమెరికా బిగ్ షాక్

international |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 11:09 PM

అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధి పొందాలని భావిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు ఆ దేశం చేదువార్త చెప్పింది. అత్యంత ఆదరణ పొందిన హెచ్-1బీతో పాటు పలు రకాల ఇమ్మిగ్రేషన్ వీసాల 'ప్రీమియం ప్రాసెసింగ్' ఫీజులను పెంచుతూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ప్రభావం దృష్ట్యా ఈ ధరల సవరణ చేపట్టినట్లు వెల్లడించిన యూఎస్‌సీఐఎస్.. కొత్త ఫీజులు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.


ద్రవ్యోల్బణం సెగ.. వీసా ఫీజులపై పడగ!


జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ సర్దుబాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా వీసా దరఖాస్తుల పరిష్కారానికి నెలల సమయం పడుతుంది. అయితే త్వరగా ఫలితం ఆశించే వారు (ఎక్స్‌పెడైటెడ్ సర్వీస్) భారీగా డబ్బు చెల్లించి 'ప్రీమియం ప్రాసెసింగ్' సదుపాయాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఆ సేవలే మరింత ప్రియం కానున్నాయి.


ఏ వీసాకు ఎంత భారం?


మార్చి నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫీజులు ఇలా ఉండబోతున్నాయి. హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు ప్రస్తుతం ఉన్న 2,805 డాలర్ల ఫీజు 2,965 డాలర్లకు పెరిగింది. అలాగే గ్రీన్ కార్డ్ దరఖాస్తుల(I-140) ఎంప్లాయిమెంట్ బేస్డ్ పిటిషన్ల ఫీజు కూడా 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు చేరింది. ఇక ఎఫ్-1 విద్యార్థులు కోరుకునే OPT, STEM-OPT ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది. అలాగే విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల స్టేటస్ మార్పు ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది.


అమెరికాలో హెచ్-1బీ వీసాలను అత్యధికంగా పొందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఉద్యోగ మార్పులు (H-1B Transfer), వీసా పొడిగింపుల సమయంలో చాలామంది భారతీయ నిపుణులు ప్రీమియం ప్రాసెసింగ్‌నే నమ్ముకుంటారు. అలాగే అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టా పొంది స్థానికంగా ఉద్యోగాల్లో చేరే భారతీయ విద్యార్థులు కూడా ఈ ఫీజుల పెంపు వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడనున్నారు.పెరిగిన ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యూఎస్‌సీఐఎస్ కార్యకలాపాల ఆధునీకరణకు వాడనున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించడం, డిజిటలైజేషన్ పక్రియను పెంచడం వంటి అంశాలకు ఈ నిధులను వెచ్చిస్తామని స్పష్టం చేసింది. మార్చి 1వ తేదీ కంటే ముందే పిటిషన్లు దాఖలు చేసే వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. కాబట్టి అత్యవసర ప్రాసెసింగ్ అవసరమున్న వారు ఫిబ్రవరి ఆఖరులోపు దరఖాస్తులు పూర్తి చేసుకోవడం ఉత్తమం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa