సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించే భోగి మంటల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య సూచించారు. పండుగ పూట ఉత్సాహంతో చేసే కొన్ని పనులు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి చేటు కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ పండుగలో కాలుష్యానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో మంటలు వేసేటప్పుడు పరిసరాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
భోగి మంటల్లో పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లు మరియు ఫ్లెక్సీలను వేయడం అత్యంత ప్రమాదకరమని ఛైర్మన్ హెచ్చరించారు. రంగులు వేసిన పాత ఫర్నీచర్, నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మంటల్లో వేయరాదని ఆయన గట్టిగా సూచించారు. కేవలం కట్టెలు, పిడకలు మరియు ఇతర సహజ సిద్ధమైన వ్యర్థాలను మాత్రమే వాడాలని ఆయన గుర్తు చేశారు. ఆధునిక కాలంలో వస్తున్న ఈ ప్రమాదకర మార్పుల వల్ల పండుగ స్ఫూర్తి దెబ్బతింటోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్లాస్టిక్ మరియు రసాయన పదార్థాలను కాల్చడం వల్ల కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి అత్యంత విషపూరిత వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఇవి పీల్చడం వల్ల శ్వాసకోస సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా, చిన్నపిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. ఈ గాలి పర్యావరణంలో ఎక్కువ కాలం నిలిచి ఉండటం వల్ల గాలి నాణ్యత పడిపోయి ఉపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతుంది. పండుగ సంబరం విషాదంగా మారకూడదంటే ప్రజలు ఈ విషయంలో కచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు.
కాలుష్య రహిత సంక్రాంతిని జరుపుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని, భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడం కోసం ఇలాంటి హానికరమైన పద్ధతులకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ ఈ మార్గదర్శకాలను పాటించి ఆరోగ్యకరమైన వాతావరణంలో పండుగను ఆస్వాదించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సూచనలను గౌరవిస్తూ పర్యావరణ హితంగా భోగిని నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa