సాధారణంగా మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ రూపాయి బిళ్ల కనిపించినా వెంటనే తీసేస్కుంటాం. వెనకా ముందు చూసి మరీ ఎవరూ రావట్లేదని గుర్తించాకే జేబులో వేసుకుంటాం. పొరపాటున ఎవరైనా కనిపిస్తేనే.. ఇది మీదేనా అని అడుగుతాం. వారు కాదంటే ఇక అది మనదే అవుతుంది. కానీ చెత్త కుప్పలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 36 తులాల బంగారు ఆభరణాలు దొరికాయి. దాదాపు రూ.45 లక్షలు విలువ చేసే ఈ బంగారు నగలను ఆమె చూసిన వెంటనే తన ఇంటికి తీసుకెళ్లాలని భావించలేదు. పాపం పోగొట్టుకున్న వారికే వాటిని అందజేయాలని నిర్ణయించుకుంది. వెంటనే వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. మరి ఆపై ఏం జరిగిందంటే...?
అసలేం జరిగిందంటే..?
చెన్నై ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల పద్మ.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. అయితే ఎప్పటిలాగే ఆదివారం రోజు కూడా ఆమె విధుల్లోకి వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం టీ నగర్లోని ముపాతు అమ్మన్ కోయిల్ వీధిలో ఆమె తన విధులను ముగించుకుని.. తన చేతి గ్లౌజులు, చీపురును అధికారులకు అప్పగించేందుకు వెళ్తోంది. అప్పుడే రోడ్డు పక్కన ఉన్న ఓ తోపుడు బండిపై ఓ ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించింది. అయితే అక్కడ యజమాని కూడా లేడు. ఎవరిదై ఉంటుంది బ్యాగు అని వెతికి చూడగా ఎవరూ కనిపించలేదు.
దీంతో ఎవరైనా పొరపాటును వదిలేశారేమో అని భావించిన ఆమె.. అందులో ఏముందో చూడాలనుకుంది. వెంటనే వెళ్లి బ్యాగును తెరిచి చూసింది. అందులో ఏ పండ్లో, కూరగాయాలో, చెత్తో ఉంటుందని ఆమె అనుకున్నప్పటికీ.. వీటికి పూర్తి భిన్నంగా అందులో బంగారం కనిపించింది. చైన్లు, కమ్మలు, గాజులు వంటివన్నీధగధగా మెరిసిపోతూ దర్శనం ఇవ్వగా.. ఆమె షాక్కు గురైంది. వెంటనే ఆ ప్లాస్టిక్ కవర్ను తన వెంట తీసుకెళ్లి పైఅధికారులకు సమాచారం అందించింది. వారంతా కలిసి చాలా సేపు అక్కడ వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో.. ఆ తర్వాత ఆ నగలను తీసుకుని పాండీ బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు అప్పగించారు.
"ఆ బ్యాగులో నగలను చూడగానే నాకు ఒక్కటే అనిపించింది. ఈ నగలను పోగొట్టుకున్న కుటుంబం ఎంతలా కుమిలిపోతుందో కదా అనిపించింది. ఆ బాధను వారు తట్టుకోలేరని భావించి వెంటనే పోలీసులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని పద్మ ఎంతో వినమ్రంగా చెప్పారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నగలను పోగొట్టుకున్న రమేష్ అనే వ్యక్తిని గుర్తించారు. రమేష్ తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో పొరపాటున ఆ బ్యాగును తోపుడు బండిపై వదిలేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. సరైన పత్రాలను పరిశీలించిన తర్వాత పోలీసులు.. దాదాపు 45 లక్షల రూపాయల విలువ చేసే ఆ 45 సవర్ల (36 తులాల) బంగారాన్ని రమేష్కు అప్పగించారు.
పద్మ నిజాయితీ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోమవారం పద్మను సచివాలయానికి ఆహ్వానించి.. ఆమెను శాలువాతో సత్కరించారు. ఆమె నిజాయితీకి గుర్తింపుగా ప్రభుత్వం తరపున రూ. 1 లక్ష నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందజేశారు. పద్మ భర్త సుబ్రమణి కూడా గతంలో ఓ ఆటోలో దొరికిన రూ. 1.5 లక్షలను బాధితులకు అందజేసి తన నిజాయితీని చాటుకోవడం విశేషం. ఆ కుటుంబం పేదరికంలో ఉన్నా.. వారి సంస్కారం మాత్రం కోట్లాది రూపాయల కంటే గొప్పదని నెటిజన్లు కొనియాడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa