ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ పథకంలో భారీ కుంభకోణం.. 5 ఏళ్లుగా కోట్లల్లో మోసం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 08:04 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దేశంలోని పేదల కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పథకాన్ని కొంత మంది ముఠా పక్కదారి పట్టించింది. ఈ పథకంలో కోట్లాది రూపాయల మోసం బయటికి వచ్చింది. బతికున్న వారిని చనిపోయినట్లుగా.. చనిపోయిన వారిని బతికున్నట్లుగా రికార్డులు సృష్టించి బీమా సొమ్మును కాజేస్తున్న ఒక ముఠాను మధ్యప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం బట్టబయలు చేసింది.


కుంభకోణం ఎలా జరిగింది?


నిందితులు అత్యంత పక్కా ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బతికి ఉన్నవారు చనిపోయినట్లుగా గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో నకిలీ డెత్ సర్టిఫికేట్లను సృష్టించేవారు. ఆ తర్వాత ఆ నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంక్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షియోపూర్ బ్రాంచ్) ద్వారా పంపించి.. బీమా కంపెనీల నుంచి ఒక్కో కేసుకు రూ. 2 లక్షల క్లెయిమ్ పొందేవారు. అయితే ఆ పేద కుటుంబాలకు అందాల్సిన ఈ బీమా సొమ్మును ముఠా సభ్యులు తమ సొంత అకౌంట్లకు మళ్లించుకున్నారు.


షియోపూర్ జిల్లాలో స్టార్ యూనియన్ దై ఇచి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డేటాను పరిశీలించినప్పుడు ఈ మోసం బయటికి వచ్చింది. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన 6 కేసుల్లో కేవలం ఒకటి మాత్రమే నిజమైంది కాగా.. మిగిలిన 5 కేసుల్లో బతికున్న వారినే చనిపోయినట్లుగా చూపి రూ. 10 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. ఇది కేవలం ఒక జిల్లాకో.. ఒక కంపెనీకో పరిమితం కాలేదు. ఎల్ఐసీ, ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి దాదాపు 8 బీమా కంపెనీల నుంచి డబ్బులు కొట్టేసినట్లు గుర్తించారు. 2020 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు 5 ఏళ్ల పాటు.. ఈ మోసాలు జరిగినట్లు గుర్తించారు.


ఈ ఇన్సూరెన్స్ ముఠాలో ప్రధానంగా దీపమాల మిశ్రా, జిజ్ఞేష్ ప్రజాపతి, నవీన్ మిట్టల్, పూజా కుమారి అనే వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్, యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు సహకరించినట్లు తేలింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ 2023) ప్రకారం సెక్షన్ 318, 319, 336, 338, 340, 61(2) కింద ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, మోసం కేసులు నమోదు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa