ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేక్ యాక్సిడెంట్ డ్రామా,,,,రోడ్లపై నయా దందాకు తెరలేపిన కేటుగాళ్లు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 08:03 PM

సులభంగా డబ్బులు సంపాదించడం కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వాహనదారులు లక్ష్యంగా కొత్త దందాలకు తెరలేపుతున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా బెంగళూరు వాసులను ఈ తరహా మోసాలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బెంగళూరు రోడ్లపై కొత్త తరహా మోసం బయటపడింది. నడి రోడ్డుపై వాహనదారులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి.. ఈ నయా మోసాన్న బట్టబయలు చేశాడు.


బెంగళూరుకు చెందిన కిరణ్ రాజ్‌పుత్‌కు ఇటీవల వింత అనుభవం ఎదురైంది. ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. డబ్బులు గుంజడానికి కేటుగాళ్లు తనను ట్రాప్ చేసినట్లు కిరణ్ తెలిపాడు. ఆ మోసం నుంచి తాను ఎలా తప్పించుకున్నాడో వివరిస్తూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు రాశాడు. "నేను ఆఫీసు నుంచి కారులో తిరిగి వస్తుండగా.. రిచ్‌మండ్ సర్కిల్ సిగ్నల్ దగ్గర ఓ యువకుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కారు వెనుకకు వచ్చాడు. నా కారు అతడిని ఢీకొట్టిందని, దీంతో అతడి కాలికి గాయమైందని చెబుతూ నా కారు కిటికీని కొట్టడం మొదలుపెట్టాడు. నేను రోడ్డుపై గొడవలకు దిగను కాబట్టి.. చేతులెత్తి సారీ చెప్పాను. అయితే ఆ యువకుడు'నాకు నీళ్లు ఇవ్వు.. నాకు గాయమైంది' అని అరవడం మొదలుపెట్టాడు. అయితే ట్రాఫిక్‌లో నేను కారు నేను కారు ఆపలేదు" అని కిరణ్ చెప్పాడు.


"ఈ క్రమంలో మరో వ్యక్తి బైక్‌పై.. 'ఆపండి ఆపండి... అతడికి గాయమైంది' అని చెబుతూ నన్ను వెంబడించాడు. అతడిపై నాకు అనుమానం వచ్చి.. సిగ్నల్ దాటిన తర్వాత కారు వేగంగా నడిపాను. 2 కిలోమీటర్ల తర్వాత కూడా.. వారు నన్ను వెంబడిస్తున్నట్లు గమనించాను. దీంతో విఠల్ మాల్యా రోడ్ / కేఫ్ కాఫీ డే ఎదురుగా ఉన్న కబ్బన్ పార్క్ గేట్ వద్ద కారు ఆపాను. వారిద్దరూ నా దగ్గరకు వచ్చారు. గాయమైనట్లు నటించిన వ్యక్తి నాపై అరవడం మొదలుపెట్టాడు. 'ఎందుకు పారిపోయావు, నాకు నీళ్లు ఇవ్వు, నేను నా అన్నకు ఫోన్ చేస్తాను అని బెదిరించాడు" అని కిరణ్ తెలిపాడు.


"ఈ క్రమంలో రెండో వ్యక్తి.. 'జరిగిందేదో జరిగిపోయింది.. సెటిల్ చేసుకుందాం' అని చెబుతూ రాజీకి ప్రయత్నించాడు. ఇలా 10-15 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత.. అది ఒక మోసం అని నేను గ్రహించాను. వారు రూ. 2,000 నుంచి రూ. 10 వేల వరకు బేరసారాలు ఆడారు. డబ్బులు ఇవ్వడానికి యూపీఐ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఇవ్వమని వారికి చెప్పాను. వారు నగదు రూపంలో చెల్లించమని పట్టుబట్టారు. నా దగ్గర నగదు లేదని చెప్పాను. అప్పుడు వారు దగ్గరలోని ఏటీఎంకు రమ్మన్నారు. వెంటనే వారిని వదిలి నేను రోడ్డు వైపు పరుగెత్తాను. వారిలో ఒకరు నన్ను వెంబడించడానికి ప్రయత్నించాడు. నేను పోలీసులకు కాల్ చేశానని గ్రహించి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారిద్దరూ పారిపోయారు. అనంతరం 10 నిమిషాల్లో ఒక పోలీసు వచ్చి నాతో మర్యాదగా మాట్లాడారు. 'ఎవరైనా మిమ్మల్ని వెంబడిస్తే, నా నంబర్‌కు' కాల్ చేయండి ఆ పోలీస్ చెప్పాడు" అని మోసం జరిగిన తీరును వివరించాడు.


మోసపోకుండా ఇలా చేయాలి.. !


ఈ ఘటన జనవరి 5న జరిగిందని చెప్పిన కిరణ్.. అక్కడి సీసీటీవీ ఫుటేజీలో వారి బైక్ నంబర్లు రికార్డ్ అయ్యాయని.. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. కొన్ని నెలల క్రితం తన స్నేహితుడికి కూడా ఇలాగే జరిగిందని.. అతడి వద్ద నుంచి రూ. 5 వేలు బలవంతంగా వసూలు చేశారని చెప్పాడు. ఇలాంటి మోసాల పట్ల బెంగళూరు ప్రజలు భయపడవద్దని.. డ్యాష్‌కామ్ పెట్టుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa