మెదక్ జిల్లా చేగుంట మండలంలో చిన్న కారణంతో ఒక నిండు ప్రాణం బలికావడం స్థానికంగా కలకలం సృష్టించింది. కేవలం 22 రూపాయల బాకీ విషయంలో తలెత్తిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. పండుగ పూట మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి చేసిన ఈ దారుణం అనంతసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సిరాజ్ , మహేశ్ కుమార్ వర్మ బతుకుదెరువు కోసం మెదక్ జిల్లాకు వలస వచ్చారు. వీరు చేగుంట మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో గతంలో ఇవ్వాల్సిన 22 రూపాయల బాకీని తిరిగి ఇవ్వాలని మహేశ్ కుమార్ వర్మ సిరాజ్ను కోరాడు. ఈ చిన్న విషయం కాస్తా ఇద్దరి మధ్య పెద్ద వివాదంగా మారింది.
మద్యం మత్తులో ఉన్న మహేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో మహేశ్ ఒక్కసారిగా సిరాజ్ పై దాడి చేశాడు. సిరాజ్ తలను సమీపంలోని చెట్టుకు బలంగా కొట్టడమే కాకుండా.. పక్కనే ఉన్న ఒక భారీ బండరాయితో తలపై బాదాడు. ఈ దాడిలో సిరాజ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణ స్నేహితుల్లా ఉండాల్సిన వారు కేవలం రూ.22 బాకీ కోసం ఇలా గొడవపడి ప్రాణాలు తీసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఘటన గురించి సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య చేసినట్లు మహేశ్ కుమార్ వర్మ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వలస కూలీల మధ్య ఇలాంటి ఘర్షణలు పెరగడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో నేరాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం 22 రూపాయల కోసం ఒక వ్యక్తి ప్రాణం తీయడం, మరొకరు జైలు పాలు కావడం ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa