ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విచారణకి హాజరుకానున్న పిన్నెల్లి బ్రదర్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 01:05 PM

మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మాచర్ల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవాలను రాబట్టేందుకు వీరిని విచారించాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది.2025 మేలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా, వెంకట్రామిరెడ్డి ఏ7గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ కక్షలు, గ్రామంలో ఆధిపత్య పోరు నేపథ్యంలో జరిగిన ఈ హత్యలకు పిన్నెల్లి సోదరులు పరోక్షంగా సహకరించారని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో పూర్తి నిజాలను వెలికితీయడానికి వారిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు.పోలీసుల వాదనలతో ఏకీభవించిన మాచర్ల కోర్టు న్యాయమూర్తి, జనవరి 20, 21, 22 తేదీల్లో వారిని విచారించేందుకు పోలీసులకు అనుమతినిచ్చారు. గతంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవడంతో వారు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. తాజా పరిణామంతో ఈ కేసు విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa