ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సగం ఉద్యోగులకే శాలరీ పెంపు.. మిగితా వారికి మొండి చేయేనా

business |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 11:50 PM

దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐ మైండ్ ట్రీ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతోంది. ఉద్యోగుల వేతనాల పెంపుపై కీలక ప్రకటన చేసింది. తొలుత సగం మందికే వేతనాలు పెంచనుందట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 నాలుగో త్రైమాసికంలో వేతనాల పెంపు చేపడతామని వెల్లడించింది. అయితే ఈ చివరి త్రైమాసికంలో 50 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే శాలరీ హైక్ ఉంటుందని చెబుతూ ఊహించని ఝలక్ ఇచ్చింది. కంపెనీలో పని చేస్తున్న సగం మంది మాత్రమే పెరిగిన వేతనాలు అందుకోనున్నారు. ఐటీ రంగంలో ఇది కొత్త పద్ధతిగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులకు వేతనాల పెంపు ఎప్పుడు ఉంటుంది?


ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీ ప్రకటన ప్రకారం మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులకు వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో రెండో విడతలో శాలరీ పెంపు చేపడతామని వెల్లడించింది. మొత్తంగా అందరికీ వేతనాల పెంపుదల ఉన్నప్పటికీ తొలి దశలో 50 శాతం మంది, రెండో దశలో మిగితా 50 శాతం మందికి వేతనాలు పెంచనున్నట్లు స్పష్టమవుతోంది. ఆపరేషన్ మార్జిన్లపై ప్రభావం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి విపుల్ చంద్ర తెలిపారు. క్యూ3 ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.


ఈ ఏడాది రెండు దశల్లో శాలరీ పెంపు చేపడతామని కంపెనీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. జనవరి 1, ఏప్రిల్ 1 ఇలా రెండు విడతలుగా శాలరీలు పెంచనున్నట్లు కంపెనీ సీఈఓ, ఎండీ వేణు లంబు వెల్లడించారు. ఈ క్రమంలోనే విపుల్ చంద్ర శాలరీ పెంపుపై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అయితే, వేతన పెంపు తేదీలు, ఏ మేర శాలరీలు పెంచుతున్నారు అనే వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. వేతనాల పెంపు వల్ల ఒక్కో త్రైమాసికంలో 1 శాతం మేర ప్రభావం పడనుందని, దీన్ని కంపెనీ సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా అధిగమిస్తామని తెలిపారు.


డిసెంబర్ 31 నాటికి ఎల్‌టీఐ మైండ్ ట్రీ కంపెనీ 86,958 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య నికరం 1511 మేర పెరిగినట్లు కంపెనీ ఇటీవలే తెలిపింది. 1736 మంది ఫ్రెషర్లు చేరినట్లు వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ లాభం 10.5 శాతం తగ్గి రూ.970.6 కోట్లుగా నమోదు చేసింది. కొత్త కార్మిక కోడ్స్ ప్రభావం వల్ల లాభాల్లో క్షీణత నమోదైనట్లు తెలిపింది. కార్మిక చట్టాల అమలు కోసం రూ.590 కోట్లు వెచ్చింటినట్లు తెలిపింది. ఇక కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ 11.6 శాతం పెరిగి రూ.10,781 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa