ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ ఎత్తిపోతల పధకం కోసం సమిష్టిగా పోరాడుదాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 03:32 PM

రాయలసీమకు తాగునీరు, సాగునీటి భద్రత కల్పించాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం సమిష్టి పోరాటం తప్పనిసరిగా అవసరమని తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో, రాయలసీమ అధ్యయనాలు సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యం రెడ్డి నేతృత్వంలో తిరుపతిలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, నీరు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత కారణంగా ఘర్షణలు జరుగుతాయని నిపుణులు ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధికి నీటే కీలకమని, ఆ దిశగా ఎత్తిపోతల పథకం అత్యంత అవసరమన్నారు. నిజమైన విజనరీలు వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డేనని పేర్కొంటూ, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారు తీసుకున్న నిర్ణయాలే రాయలసీమకు మేలు చేశాయన్నారు. ప్రస్తుతం పాలకులు వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై పోరాటం చేయాలని, ఈ అంశాన్ని పార్లమెంట్‌లో కూడా బలంగా లేవనెత్తుతామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa