ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జోనల్ వ్యవస్థ రద్దు, సివిల్స్‌లో మంచి ర్యాంక్ వచ్చినా దూరంగా ఉన్న రాష్ట్రాల్లో పోస్టింగ్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 25, 2026, 08:55 PM

సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన అలర్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం పరిపాలన సంస్కరణల్లో భాగంగా.. ఆలిండియా అధికారుల కేటాయింపు విధానాన్ని మార్చేసింది. సివిల్స్ సర్వీసెస్‌‌‌కు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటి వరకూ జోనల్ వ్యవస్థలో కేడర్ కేటాయిస్తున్నారు. ఇక నుంచి అక్షర క్రమంలో ఏర్పాటు చేసిన గ్రూపింగ్ విధానంలో సివిల్స్ క్యాండిడేట్లకు పోస్టింగులు ఇవ్వనున్నారు. వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం.. అన్ని రాష్ట్రాల కేడర్లు, జాయింట్ కేడర్లను ఆల్ఫాబెటికల్ క్రమంలో నాలుగు గ్రూపులుగా విభజించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకటించింది.


ఇప్పటి వరకూ దక్షిణాది రాష్ట్రాలన్నీ జోన్ 5లో ఉన్నాయి. కానీ కొత్త విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-1లో ఉంటే తెలంగాణలో గ్రూప్-4లో ఉంటుంది. తమిళనాడు గ్రూప్-3లో ఉండగా.. కర్ణాటక, కేరళ గ్రూపు-2లో ఉన్నాయి. పాత విధానంలో సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించిన వారు.. కేడర్‌ను ఎంచుకోవడానికి (ఏ రాష్ట్రంలో సర్వీస్ చేయాలనేది) వెసులుబాటు ఎక్కువగా ఉండేది. సొంత రాష్ట్రం మిస్సయితే.. పొరుగు రాష్ట్రాల్లో పోస్టింగ్ వచ్చేది. దీని వల్ల జార్ఖండ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలు లాంటి వెనుకబడిన రాష్ట్రాలకు టాపర్లు వెళ్లకపోవడం, తక్కువ ర్యాంక్ వచ్చిన వారే ఆ రాష్ట్రాలకు వెళ్లడం జరుగుతోంది. కానీ కొత్త విధానం ప్రకారం సివిల్స్‌లో మంచి ర్యాంక్ సాధించిన వారు సైతం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన రాష్ట్రం(సాధారణంగా స్వరాష్ట్రం) కేడర్‌కు ఎంపిక కాకపోతే.. దూరంగా ఉన్న రాష్ట్రాల్లో పోస్టింగ్ పొందాల్సి వస్తుంది.


కొత్త గ్రూపులు ఇలా..


గ్రూప్ I: AGMUT (అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరాం - కేంద్రపాలిత ప్రాంతాలు), ఆంధ్రప్రదేశ్, అసోం, మేఘాలయ, బిహార్, ఛత్తీస్‌గఢ్.


గ్రూప్ II: గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్.


గ్రూప్ III: మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు.


గ్రూప్ IV: తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్.


ఇంతకు ముందున్న జోన్లు:


జోన్-I: AGMUT, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా.


జోన్-II: ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా


జోన్-III: గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్


జోన్-IV: పశ్చిమ బెంగాల్, సిక్కిం, అసోం-మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్


జోన్-V: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ


కొత్త విధానం ఎందుకు?


జాతీయ సమగ్రతను పెంచడానికి, పారదర్శకత కోసం, అభ్యర్థులు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చూడటం కోసం కేంద్రం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల దక్షిణాది నుంచి సివిల్స్‌కు ఎంపికైన వారు ఉత్తరాదిలో, ఉత్తరాది నుంచి ఎంపికైన వారు దక్షిణాదిలో పని చేయడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొత్త విధానంలో అలా కుదరదు. 2026 పాలసీ ప్రకారం రాష్ట్రాలు ఖాళీల వివరాలను ఏటా జనవరి 31లోగా కేంద్రానికి పంపించాలి. దీని వల్ల కేడర్ కేటాయింపుల్లో ఆలస్యం ఉండదు.


పాత విధానంలో నచ్చిన రాష్ట్రాల్లోనే..


పాత జోన్ విధానం ప్రకారం.. సివిల్స్ అభ్యర్థులు సొంత రాష్ట్రానికి తొలి ప్రాధాన్యం ఇచ్చి.. పొరుగు రాష్ట్రాలకు వరుస క్రమంలో ప్రాధాన్యం ఇస్తూ పోయేవారు. ఉదాహరణకు తెలంగాణ అభ్యర్థినే తీసుకుంటే.. ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణకు ఇచ్చి.. రెండో ప్రాధాన్యం ఆంధ్రప్రదేశ్‌కు, మూడో ప్రాధాన్యం కర్ణాటకకు, నాలుగో ప్రాధాన్యం తమిళనాడు, ఐదో ప్రాధాన్యంగా మహారాష్ట్ర లేదా కర్ణాటక.. ఇలా ఇచ్చేవారు. దీని వల్ల సొంత రాష్ట్రమైన తెలంగాణలో పోస్టింగ్ రాకపోతే.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలోనే కచ్చితంగా పోస్టింగ్ వచ్చేది. దీని వల్ల మంచి ర్యాంక్ సాధించిన దక్షిణాది అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండేది కాదు. ఫలితంగా నాగాలాండ్, మణిపూర్ లేదా బిహార్ లాంటి రాష్ట్రాలకు చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చిన ఔట్‌సైడర్లు వెళ్తున్నారు.


కొత్త విధానం ప్రకారం..


కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం.. అభ్యర్థి ముందుగా తన గ్రూపులో ఒక రాష్ట్రానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది సహజంగానే తమ సొంత రాష్ట్రం అవుతుంది. ఆ తర్వాత సొంత గ్రూప్ నుంచి రెండో రాష్ట్రాన్ని ఎంచుకునే ముందు.. మిగతా గ్రూపుల నుంచి ఒక్కో రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు తెలంగాణ అభ్యర్థినే తీసుకుంటే.. ఫస్ట్ ప్రియారిటీ గ్రూప్‌-4లోని తెలంగాణ రాష్ట్రం అవుతుంది. రెండో ప్రాధాన్యం కింద గ్రూప్-1లోని ఆంధ్రప్రదేశ్, మూడో ప్రాధాన్యంగా గ్రూప్-2లోని కర్ణాటక, నాలుగో ప్రాధాన్యంగా గ్రూప్-3లోని తమిళనాడును ఎంచుకోవచ్చు.


కానీ 2026 పాలసీ రొటేషనల్ సైకిల్‌ను ఉపయోగిస్తుంది. దీని వల్ల టాప్ ర్యాంకర్లపైనా ప్రభావం ఉంటుంది. దీని ప్రకారం.. తొలి దశలో ఇన్‌సైడర్లను సిస్టమ్ గుర్తిస్తుంది. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై సివిల్స్‌లో పదో ర్యాంక్ సాధిస్తే.. మీ కేటగిరీలో తెలంగాణలో వేకెన్సీ ఉంటే.. మీకు తెలంగాణలోనే పోస్టింగ్ వస్తుంది. ఒకవేళ మీకు తెలంగాణలో ఇన్‌సైడర్ వేకెన్సీ లేకపోతే.. మీరు ఔట్‌సైడర్ పూల్‌కు మూవ్ అవుతారు.


ఏటా మారనున్న స్టార్టింగ్ గ్రూప్..


ప్రతి ఏడాది ఔట్‌సైడర్లకు స్టార్టింగ్ గ్రూప్ మారుతుంది. ఒకవేళ 2026లో స్టార్టింగ్ గ్రూప్ అనేది గ్రూప్-1తో మొదలవుతుంది అనుకుందాం. సిస్టమ్ ముందుగా అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఈ గ్రూపులోని అన్ని రాష్ట్రాల్లో ఒక ఖాళీ చొప్పున భర్తీ చేస్తుంది. దీని వల్ల తెలంగాణ అభ్యర్థి ఏపీ కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఔట్‌సైడర్‌లతో పోటీ పడాల్సి వస్తుంది. ఒక వేళ రాజస్థాన్‌కు చెందిన ఐదో ర్యాంక్ అభ్యర్థికి సొంత రాష్ట్రంలో రాకపోతే.. ఔట్‌సైడర్‌గా ఏపీలో అతడికి రావచ్చు. అప్పుడు మీరు అదే గ్రూపులో ఉన్న మేఘాలయ, అసోం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు ఏజీఎంయూటీల్లో ఏదో ఒక రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తుంది. అంటే దగ్గరగా ఉన్న ఇతర దక్షిణాది రాష్ట్రాలను పరిగణనలో తీసుకోకుండానే.. దూరంగా ఉన్న రాష్ట్రాలకు మీరు వెళ్లాల్సి వస్తుంది.


2026లో గ్రూప్-1 స్టార్టింగ్ గ్రూప్ అనుకుంటే.. 2027లో గ్రూప్-2, 2028లో గ్రూప్-3 రొటేషనల్‌గా స్టార్టింగ్ గ్రూప్ మారుతుంది. కాబట్టి.. ఈ సంవత్సరాల్లో తెలంగాణ అభ్యర్థి ఏపీకి వెళ్లే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. సమీపంలోని రాష్ట్రాలకు బదులుగా మీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేయాల్సి వస్తుంది.


ఒక్క మాటలో చెప్పాలంటే.. పాత విధానంలో మీకు నచ్చిన వంటకాన్ని ఎంచుకునే మెనూ లాంటిది ఉండేది. కొత్త విధానం అనేది ఫిక్స్‌డ్ థాళీ, దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన వంటకం మీ ముందు ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa