ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు అమెరికా శుభవార్త.. ట్రంప్‌నకు థ్యాంక్స్.. ప్రధాని మోదీ

international |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:17 PM

అగ్రరాజ్యం అమెరికా-భారత్ మధ్య ఇంటర్మ్ ట్రేడ్ డీల్ (మధ్యంతర వాణిజ్య ఒప్పందం) ఖరారైంది. ఇరు దేశాలు కలిసి ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. రెండు దేశాల మధ్య జరిగిన డీల్ ప్రకారం.. భారత్‌ ఉత్పత్తులపై అమెరికా 50శాతం సుంకాన్ని 18శాతానికి తగ్గించింది. అమెరికా-భారత్‌ల మధ్య ఒప్పందం ద్వారా సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటనలో తెలిపింది.. నేటి నుంచి (ఫిబ్రవరి 7) అమల్లోకి రానుంది. ఈ క్రమంలోనే రానున్న 10 ఏళ్లలో రక్షణ సహకారం విస్తరించుకునేందుకు ఇరుదేశాలు ఓ ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఈ ఒప్పందంపై ట్వీట్ చేశారు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.


'భారత్‌, అమెరికాకు శుభవార్త.. రెండు దేశాల మధ్య ఇంటర్మ్ ట్రేడ్ డీల్ (మధ్యంతర వాణిజ్య ఒప్పందం)కు సంబంధించి ఫ్రేమ్‌వర్క్ ఖరారు చేశాము. మన దేశాల మధ్య బలమైన సంబంధాలకు వ్యక్తిగతంగా నిబద్ధతతో కృషిచేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా.. మన భాగస్వామ్యం, నమ్మకం, చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్‌లో కష్టపడి పనిచేసే రైతులు, వ్యవస్థాపకులు, MSMEలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులుతో పాటు మరికొన్నింటికి కొత్త అవకాశాలు సృష్టిస్తుంది. అలాగే ఇది 'మేక్ ఇన్ ఇండియా'ను బలోపేతం చేస్తుంది.. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తుంది. భారత్, అమెరికా ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి.. పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యాలను మరింతగా పెంచుతుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా సప్లై చైన్ వ్యవస్థ బలోపేతమై ప్రపంచ వృద్ధికి దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దిశగా అడుగులుపడుతున్న సమయంలో.. మన ప్రజలను శక్తివంతం చేస్తుంది' అన్నారు.


అమెరికా-భారత్ మధ్య జరిగిన ఈ ఒప్పందం చరిత్రాత్మక విజయం అంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్వీట్ చేశారు. ఈ డీల్‌తో భారత్‌లోని ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు అవకాశం వస్తుందన్నారు. ఆయా రంగాల వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఎంతోమందికి ఉపాధితో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పుకొచ్చారు. భారత్‌ నుంచి అనేక ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేయొచ్చన్నారు. దేశవ్యాప్తంగా పలు రంగాలకు ఎంతో లాభదాయకమని వ్యాఖ్యానించారు పీయూష్ గోయల్.


రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేందుకు అంగీకరించినట్లు అమెరికా ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అమెరికా నుంచి గ్యాస్, ఇంధనం దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించినట్లు కూడా చెప్పారు. భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకునేందుకు ఓకే చెప్పినట్లు కూడా ప్రకటించారు. అంతేకాదు భారత్ నుంచి ఎగుమతయ్యే మరికొన్ని ఉత్పత్తులపై సుంకాలను సున్నాకు అమెరికా తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. గతేడాది అమెరికా భారత్‌కు సంబంధించి వస్తువులపై 25శాతం అదనంగా సుంకాలు విధించింది. అయితే తాజా ఒప్పందంలో ఆ సుంకాలను కూడా అమెరికా తొలగించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa