ఆ యువతికి 10 నెలల క్రితం వివాహమైంది.. ఇంతలో ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. భర్తకు మాయ మాటలు చెప్పడంతో అతడు ఆ యువతిని వదిలేశాడు. భర్త నుంచి విడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముంచాడు. ఆమె వేరే యువకుడితో మాట్లాడుతుందనే కోపంతో ఆమె నోట్లో పురుగుల మందు పోశాడు. ఆస్పత్రిలో చేరిన యువతి కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రాంతానికి చెందిన యువతికి గతేడాది ఏప్రిల్లో వివాహమైంది. భర్తతో జీవతం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. భవానీ శంకర్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను భర్త నుంచి విడగొట్టాలని ప్లాన్ చేశాడు. నేరుగా ఆమె భర్తక ఫోన్ చేసి అబద్ధాలు చెప్పాడు.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి యువతి తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. వెంటనే ఆమె విజయవడలో నర్సింగ్ కోర్సులు చేరాలని నిర్ణయం తీసుకుంది.. ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. అయితే భవానీ శంకర్ మళ్లీ ఆమె వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు. ఆ యువతి భవానీ శంకర్ వేధింపులు భరించలే.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
యువతి తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి ఓ హాస్టల్లో చేర్చారు.. అక్కడే ఉండి ఆమె చదువుకుంటున్నారు. కొంతకాలం భవానీ శంకర్కు ఆమె వివరాలు తెలియలేదు. ఇంతలో యువతి ఇన్స్టాగ్రామ్ ఐడీ గురించి అతడికి తెలిసింది. మెల్లిగా ఆమె మొబైల్ నంబర్ తెలుసుకుని కాల్ చేసి మళ్లీ వేధించాడు. అయితే పెళ్లి చేసుకుంటానని పదే, పదే చెప్పడంతో ఆమె కూడా నిజమని నమ్మింది. ఈ నెల 2న భవానీ శంకర్ పిలవడంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చింది.. ఆమెను దేవీనగర్లోని రూమ్కు తీసుకెళ్లాడు. అయితే ఆ మరుసటి రోజు యువతి మొబైల్ను భవానీ శంకర్ చెక్ చేశాడు.
యువతి మొబైల్లో ఓ యువకుడి ఫోన్ నంబర్ ఉండటాన్ని భవానీ శంకర్ గమనించాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న భవానీ శంకర్ గొడవకు దిగాడు.. ఆమెపై చేయి చేసుకున్నాడు. యువతి భవానీ శంకర్ గది నుంచి బయటకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్దామని భావించింది. ఆమె రైల్వే స్టేషన్కు వెళ్లగా.. భవానీ శంకర్ కూడా వెనకే వెళ్లాడు. మళ్లీ యువతకి నచ్చజెప్పి గదికి తీసుకొచ్చాడు.. ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. ఆ తర్వాత కోపంతో భవానీ శంకర్ యువతి నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు. యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి తల్లికి సమాచారం ఇచ్చాడు. భవానీ శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువతి కోలుకున్న తర్వాత విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. భవానీ శంకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa