ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏప్రిల్ 14వ తేదీ మరో రెండు క్వాంటం సెంటర్లు ఏర్పాటు.. చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:48 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ నిర్మాణానికి పునాదిరాయి పడింది. అమరావతి క్వాంటం వ్యాలీ భవనం నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో అమరావతి ‘క్వాంటమ్‌ వ్యాలీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీ కోసం ఏపీ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే.


అమరావతి క్వాంటం వ్యాలీలో టీసీఎస్, ఐబీఎం, ఎల్అండ్‌టీ వంటి సంస్థలు కీలకంగా ఉన్నాయి. భారతదేశపు తొలి 133 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటు చేయడానికి ఈ సంస్థలు కృషి చేస్తున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీ.. క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగాలలో పరిశోధనలు, ఆవిష్కరణలకు వేదిక కానుంది. క్వాంటం టెక్నాలజీ రంగంలో అమరావతిని హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. అమరావతి క్వాంటం వ్యాలీ భవనం నిర్మాణాన్ని ఆగస్టు నాటికి పూర్తి చేసి, డిసెంబరు నాటికి క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


మరోవైపు అమరావతి క్వాంటం వ్యాలీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ దేశానికే గేమ్ ఛేంజర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ గేమ్ ఛేంజర్‌గా మారితే.. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికే గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. రాబోయే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.


మరోవైపు 2026 చివరికల్లా అమరావతి క్వాంటం వ్యాలీలో మొదటి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు వివరించారు. ఏప్రిల్ 14వ తేదీ అమరావతి క్వాంటం వ్యాలీలో మరో రెండు క్వాంటం సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2030లోగా రెండున్నర లక్షల మంది క్వాంటం నిపుణుల అవసరం ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ క్రమంలో క్వాంటం వ్యాలీ కీలకంగా మారుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, అమరావతి క్వాంటం వ్యాలీ గేమ్ ఛేంజర్లుగా చంద్రబాబు అభివర్ణించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన జరిగిన ఈ రోజు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa