పశ్చిమ్ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాధానంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పాంచోలిల ధర్మాసం విచారించింది. 1.36 కోట్ల మంది ఓటర్లు తార్కిక వ్యత్యాస జాబితాలో ఉన్నారని, ‘ఇంటిపేర్లలో అక్షరదోషాలు’ లేదా పెళ్లి తర్వాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న చిన్న లోపాల ఆధారంగా వారి పేర్లు తొలగించారని బెంగాల్ సీఎం ఆరోపించారు. గతవారం ఈ కేసులో ఆమె స్వయంగా తన వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. న్యాయం మూసిన తలుపుల చాటున దుఖిస్తోందని, తమకు ఎక్కడా న్యాయం జరగడం లేదని దీదీ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, 8,300 మంది మైక్రో-అబ్జర్వర్లుగా ఈసీ నియమించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఎటువంటి అధికారం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా ఓటరు జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తున్నారని దీదీ ఆరోపించారు. ఈ సందర్భంగా సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఏవైనా ఆదేశాలు లేదా స్పష్టత అవసరమైతే, మేము జారీ చేస్తాం... కానీ ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకిని మేము అనుమతించం... దీనిని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించింది.
మైక్రో అబ్జర్వర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తాము ఐదు లేఖలు రాసినా.. వారు స్పందించకపోవడమే తామే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాల్సి వచ్చిందని ఈసీ తరఫున లాయర్ కోర్టుకు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు అవసరమైన అధికారుల పేర్ల వివరాలను బెంగాల్ ప్రభుత్వం తమకు అందజేయలేదని ఆరోపించారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ... ఎన్నికల సంఘం ఎప్పుడూ గ్రూప్-బి అధికారులను కోరలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అభ్యర్థన ఏదీ చేయలేదని తెలిపారు.
మమతా బెనర్జీ తరపున హాజరైన శ్యామ్ దివాన్ ఈసీ వాదనలను తిప్పికొడుతూ.. పేర్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎన్నికల కమిషన్కు పంపారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. మేము ఫిబ్రవరి 4న ఆదేశాలు ఇస్తే.. ఫిబ్రవరి 7న ఉదయం 12 గంటల వరకూ ఎందుకు పంపలేదని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మైక్రో-అబ్జర్వర్ల స్థానంలో 8,000లకుపైగా గ్రూప్ బి అధికారుల పేర్లను పంపడంలో ఎందుకు జాప్యం జరిగింది’ అని సీజేఐ నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa