బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇప్పటికే ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు ఇజ్రాయెల్తో అమెరికా కలిసింది. రెండు దేశాలు కలిసి ఇరాన్పై దాడికి దిగాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం, వెండి పైకి పెట్టుబడులు మళ్లించగా వీటి ధరలు శనివారం రోజు రికార్డు స్థాయిలో ఎగబాకాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ధరలు పుంజుకున్నాయి. దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 6550 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,54,650 కి చేరింది. కిందటి రోజు ఇది రూ. 500 మేర పెరిగింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 7140 పెరగడంతో తులం ఇప్పుడు రూ. 1,68,710 కు చేరింది.
వెండి ధర కూడా భారీగానే పెరిగింది. ఒక్కరోజులో రూ. 25 వేలు పెరగడంతో కేజీకి రూ. 3.20 లక్షల మార్కుకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5,279 డాలర్ల స్థాయిలో ఉండగా.. సిల్వర్ రేటు 93.80 డాలర్ల మార్కుకు ఎగబాకింది.
>> దీంతో ప్రస్తుతం గోల్డ్ జువెల్లరీల్లోనూ ధరలు అప్డేట్ అయ్యాయి. ఈ మధ్య రోజుకు 2-3 సార్లు కూడా బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగానే రేట్లు వేగంగా మారుతున్నాయి. లలితా జువెల్లరీలో గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 15,465 వద్ద ఉంది. తనిష్క్ జువెల్లరీలో చూస్తే పసిడి ధర గ్రాముకు ప్రస్తుతం రూ. 15,505 గా ఉంది. ఖజానా జువెల్లరీలో గోల్డ్ రేటు గ్రాముకు ప్రస్తుతం రూ. 15,465 గానే ఉంది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీలో (MCX) కూడా బంగారం ధర ఒక్కసారిగా ఎగబాకింది.
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిసి సంయుక్త దాడులు చేపట్టాయి. దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధ్రువీకరించారు. తాము పలు మార్లు హెచ్చరించినప్పటికీ ఇరాన్ అణుకేంద్రాల్ని పునర్నిర్మించేందుకు.. క్షిపణుల్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా తాము భారీ స్థాయిలో సైనిక చర్య చేపట్టినట్లు వెల్లడించారు. ఇంకెప్పటికీ ఇరాన్ అణ్వాయుధాల్ని కలిగి ఉండకుండా చేసేందుకు పూర్తిగా నాశనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆ దేశ నాయకులు తమ మాట వినకుంటే.. దేశాన్ని పూర్తి స్థాయిలో కూడా నాశనం చేసేందుకు వెనుకాడబోమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారుగా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే బంగారానికి మళ్లీ డిమాండ్ భారీగా పెరిగింది. ధరలు పెరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa