యూపీఎస్సీ సివిల్స్ 2025 ఫలితాల్లో విజేతలుగా నిలిచి, పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ లేదని పలువురు నిరూపించారు. అన్ని సౌకర్యాలు ఉన్నా.. కాలం కలిసి రాలేదని నిరాశతో కొందరు ప్రయత్నాలే చేయడం మానుకుంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే ఎన్ని కష్టాలు ఎదురైనా విధికి ఎదురెళ్లి అనుకున్నది సాధిస్తారు. అలాంటిది కేన్సర్ మహమ్మారితో పోరాడి జయించిన ఓ యువకుడు.. సివిల్స్లో విజేతగా నిలిచి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. అతడే, ఛత్తీస్గఢ్కు చెందిన 38 ఏళ్ల సంజయ్ దహారియా . యూపీఎస్సీ 2025 ఫలితాల్లో 946వ ర్యాంకు సాధించాడు.
సాధారణ రైతు కుటుంబానికి చెందిన దహారియా.. ఒకటి రెండు కాదు దాదాపు పదేళ్ల పాటు కేన్సర్తో పోరాటం చేశాడు. నాలుగు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు.. పాక్షికంగా వినికిడి లోపం, పక్షవాతం బారినపడ్డాడు. ఈ క్రమంలో చూపు మందగించినా అతడు వెనకడుగు వేయలేదు. రెండుసార్లు విఫలమైనా పట్టు వదల్లేదు. చివరకు 38వ ఏట UPSC ర్యాంకు సాధించారు. మూడు ఉద్యోగాలకు రాజీనామా చేసి, కేన్సర్ను జయించాడు. ఛత్తీస్గఢ్లోని మహసముంద్ జిల్లాకు చెందిన సంజయ్కు సివిల్స్ అనేది చిన్ననాటి కళ.
‘‘జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నప్పుడు ఛైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండేవారు.. నేను కూడా ఐఏఎస్ కావాలని మనసులో అప్పుడే బలంగా నాటుకుపోయింది.. కానీ, కుటుంబ పరిస్థితులు కారణంగా నన్ను నేను పోషించుకోవడానికి ఉద్యోగాలు చేసుకోవాల్సి వచ్చింది. ఇంటర్ తర్వాత ప్రభుత్వ పాఠశాల టీచర్గా పనిచేస్తూ చదువును కొనసాగించాను. ఆ తర్వాత ఎస్బీఐ, ఇండియన్ పోస్ట్లతో సహా వివిధ ప్రభుత్వ రంగ/ ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేశాను’’ అని తెలిపారు.
‘‘ఉద్యోగాలు చేసుకుంటూనే రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు చదువుకు కేటాయించాను... అయితే, నేను ఇంతకుముందు ఎంపికైన పోటీ పరీక్షల మాదిరిగా కాకుండా UPSCకి అపారమైన జ్ఞానం, సుదీర్ఘ ప్రిపరేషన్ అవసరం.. నేను గతంలో రెండుసార్లు నిర్మాణాత్మకంగా సాగించకపోవడంతోనే విఫలమయ్యాయి’ అని 38 ఏళ్ల ఆయన అన్నారు.
కానీ, 2012లోకుడివైపున చెవి కింద భాగంలో వాపు వస్తే.. ఏదోలే తగ్గిపోతుంది అనుకున్నాను.. కానీ, అది నా జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని ఊహించలేదు.. మందులు వాడినా తగ్గకపోవడంతో అనుమానంతో బయాప్సీ చేయడంతో లాలాజల గ్రంథుల్లో కేన్సర్ కణితి ఉన్నట్టు నిర్దారణ అయ్యింది.. గ్రంథి పైభాగంలో శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు.. 2013లో కింద భాగంలో మరో సర్జరీ చేయాల్సి వచ్చింది.. మళ్లీ 2015లో సర్జరీ చేసి లాలాజల గ్రంథిని పూర్తిగా తొలగించారు.. రాయ్పూర్, భిలాయ్, ముంబయిలో చికిత్స చేయించుకున్నాను.. తర్వాత కొన్నేళ్ల పాటు తరుచూ వైద్య పరీక్షల కోసం తిరగాల్సి వచ్చింది.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగానికి ఎంపికైన సొంత జిల్లాలో పోస్టింగ్ సాధించాను.. 2018లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు ఎంపికైనా.. సివిల్స్ సాధించాలనే కోరికతో దానిని వదలుకున్నాను..
ఆరోగ్యం కుదుటపడటంతో పూర్తిస్థాయిలో యూపీఎస్సీకి సన్నద్ధమై 2019లో తొలిసారి రాశాను.. ఆ ప్రయత్నం విఫలం కావడంతో రెండోసారి 2024లోనూ అదే ఫలితం వచ్చింది. చివరకు రెండు ప్రయత్నాల్లో తాను చేసిన లోపాలను సరిదిద్దుకుని.. 2025 పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాను.. ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూకు వెళ్లాను.. ఫలితాల్లో తన పేరు ఉండటంతో నా కల నెరవేరింది. ప్రస్తుత ర్యాంకుకు ఐఆర్ఎస్ వస్తుంది.. ’’ అని సంజయ్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa