ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.7500.... 7.5 రెట్లు పెంచడం సాధ్యమేనా

business |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 10:06 PM

దేశవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది EPS-95 పెన్షనర్లు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్ద కాలంగా మారని కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలంటూ వారు చేస్తున్న పోరాటం తారస్థాయికి చేరుకుంది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చలో ఢిల్లీ నినాదంతో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతుండడం ఆర్థిక, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీస పెన్షన్ రూ.1000 నుంచి రూ. 7500లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఒకేసారు 7.5 రెట్లు పెన్షన్ పెంచడం సాధ్యమేనా?


ప్రస్తుతం EPS-95 పథకం కింద కనీస పెన్షన్ నెలకు రూ. 1,000 మాత్రమే. ఈ మొత్తాన్ని 2014లో నిర్ణయించారు. గడిచిన 10 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో నెలకు రూ. 1,000తో జీవించడం అసాధ్యమని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ అజిటేషన్ కమిటీ (NAC) నేతృత్వంలో పెన్షనర్లు తమ కనీస పెన్షన్‌ను రూ.1000 నుంచి రూ. 7,500కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం పెన్షన్ పెంపు మాత్రమే కాకుండా, దానికి డియర్నెస్ అలవెన్స్ (DA) జత చేయాలని, పెన్షనర్లు, వారి భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. 30-35 ఏళ్ల పాటు సర్వీసులో ఉండి, తమ జీతాల నుంచి వాటా చెల్లించిన తమకు ప్రభుత్వం ఇచ్చే ఈ నామమాత్రపు మొత్తం గౌరవప్రదంగా లేదని వారు వాదిస్తున్నారు.


పెంపు సాధ్యమేనా?


కనీస పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 7,500 కి పెంచడం అంటే ఏకంగా 7.5 రెట్ల పెంపు అవుతుంది. ఈ స్థాయి భారీ పెంపుపై ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది. ప్రభుత్వం, EPFO వర్గాల ప్రకారం EPS నిధి అనేది ఉద్యోగులు, యజమానుల వాటాతో నడుస్తుంది. ప్రస్తుతమున్న నిధుల లెక్కల ప్రకారం ఇంత భారీ మొత్తంలో పెన్షన్ చెల్లించాలంటే ప్రభుత్వ ఖజానాపై లక్షల కోట్ల భారం పడుతుంది. EPS-95 అనేది ఒక నిర్దిష్ట కాంట్రిబ్యూషన్ ఆధారిత పథకం. ఇందులో ప్రభుత్వం కేవలం 1.16 శాతం మాత్రమే వాటా ఇస్తుంది. కనీస పెన్షన్ పెంచాలంటే యజమానుల వాటా పెరగాలి లేదా ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న నిధుల లోటు కారణంగా ఈ పెంపు కష్టతరమని ప్రభుత్వం భావిస్తోంది.


తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 9 నుంచి 11 వరకు ఢిల్లీలో మూడు రోజుల పాటు 'డూ ఆర్ డై' నిరసనలను పెన్షనర్లు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పెన్షనర్లు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. అనేక రాజకీయ పార్టీల ఎంపీలు కూడా వీరి పోరాటానికి మద్దతు ప్రకటిస్తుండటం గమనార్హం. కనీస పెన్షన్ పెంపు అనేది కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదు, ఇది లక్షలాది మంది పెన్షనర్ల ఆత్మగౌరవానికి, జీవించే హక్కుకు సంబంధించిన విషయం. 7.5 రెట్ల పెంపు ఆర్థికంగా సవాల్‌తో కూడుకున్నదే అయినప్పటికీ, కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా గౌరవప్రదమైన మొత్తాన్ని పెంచాలని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరి ఈ నిరసనల సెగ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మారుస్తుందో లేదో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa