ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రప్రదేశ్ 5 అవార్డులను దక్కించుకుని దేశంలో అగ్రస్థానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 06:12 AM

జాతీయ జలమిషన్ ప్రప్రధమంగా ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ 5 అవార్డులను దక్కించుకుని దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.  “మన నీరు – మన భవిష్యత్తు” అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని జాతీయ సంపదైన జలవనరులను సంరక్షించుకోవడం, సమర్ధవంతంగా వినియోగించుకోవడం అనే దిశగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు నిర్వహించిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రధానం చేయడం జరిగింది.  బ‌ధ‌వారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యుపి సింగ్, జాతీయ జల మిషన్ డైరెక్టర్ అశోక్‌కుమార్ మరియు వివిధ రాష్ట్రాల కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు.  మొత్తం 5 క్యాటగిరీలలో 23 అవార్డులను ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ 3 అవార్డులను, రాష్ట్ర ఉద్యానవన శాఖ 1 అవార్డును, హిందుస్థాన్ కోకోకోలా బెవరేజస్ సంస్థ 1 అవార్డును దక్కించుకుని రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. నీటివనరుల డేటా నిర్వహణ కేటగిరిలో రాష్ట్ర జలవనరుల సమాచార వ్యవస్థ పేరిట జలవనరుల అన్నింటిపైన సమగ్ర సమాచారాన్ని ప్రజ‌ల‌కు అందుబాటులోకి తెచ్చినందుకు మొదటి అవార్డు దక్కింది.  బేసిన్ల వారీగా నీటి నిర్వహణ కేటగిరిలో రాష్ట్రంలో వున్న 40 నదీ బేసిన్ల పరిధిలో నీటిని సమర్ధవంతంగా నిర్వహించినందుకుగాను ఈ కేటగిరీలో కూడా మొదటి అవార్డును రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. నీటి వనరులపై వాతావరణ ప్రభావం అంచనా మరియు వాటి నిర్వహణ అనే కేటగిరిలో రెండు అవార్డులు ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ అవార్డును సాధించింది.  కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ చేతుల మీదుగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధమ స్థానం పొందిన రెండు అవార్డులకు రూ.2 లక్షలు చొప్పున, ద్వితీయ అవార్డుకు రూ.1.50 ల‌క్ష‌లు చొప్పున మొత్తం రూ.6.50 లక్షలు నగదు బహుమతి రాష్ట్ర జలవనరుల శాఖకు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మొదటి అవార్డును స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, రెండవ అవార్డును ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, మూడవ అవార్డును భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ ఏ.వరప్రసాదరావు ఇతర అధికారులతో కలసి ఈ అవార్డులను అందుకున్నారు.  20 శాతం నీటి వినియోగంలో ఆదా చేసిన కేటగిరీలో రాష్ట్ర ఉద్యానవన  శాఖ 3వ అవార్డును మరియు రూ.లక్ష నగదును అందుకుంది.  20 శాతం నీటివినియోగంలో ఆదా చేసిన పరిశ్రమల కేటగిరిలో గుంటూరులోని  హిందుస్థాన్ కోకోకోలా  బెవరేజస్ సంస్థ మొదటి అవార్డును మరియు రూ.2 లక్షల నగదు బహుమతిని అందుకుంది. మొత్తం ప్రధానం చేసిన 23 అవార్డులలో ఆంధ్రప్రదేశ్ 5 అవార్డులను దక్కించుకుని ప్రథమస్థానంలో, తెలంగాణా 3 అవార్డులతో 2వ స్థానంలో, రాజస్థాన్ రెండు అవార్డులతో 3వ స్థానంలో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ ఒక్కొక్క అవార్డుతో తరువాతి స్థానంలో నిలిచాయి. అత్యధిక అవార్డులను దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ప్రత్యేకంగా అభినందించారు.  అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ట్ర అధికారులు కూడా రాష్ట్ర అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa