మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలసి తన రాజీనామాను సమర్పించారు. మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎన్నికల ముందు బీజేపీ - శివసేన పొత్తు పెట్టుకుని కలసి పోటీ చేశాయి. బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ రెండున్నరేళ్లు తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన పట్టుబట్టడంతో మహారాష్ట్ర పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు శివసేన మెట్టుదిగలేదు. ఈ రోజుతో మహారాష్ట్రలో అసెంబ్లీ పదవీకాలం ముగిసింది. దీంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ను కలసి తన రాజీనామాను సమర్పించారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లున్నాయి. అక్టోబర్ 21న వెలువడిన ఫలితాల్లో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే బీజేపీకి గతంలో పోల్చితే కొన్ని సీట్లు తగ్గితే.. శివసేన తన గ్రాఫ్ను పెంచుకుంది. ఈ క్రమంలో సీఎం పీఠంపై కన్నేసింది శివసేన. సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది.
గవర్నర్ను కలసి రాజీనామా చేసిన తర్వాత ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. తనకు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తన ఐదేళ్ల పాలనలో సహకరించిన శివసేనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన ఐదేళ్ల పదవీకాలంలో మహారాష్ట్రలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రైతుల కోసం, ముంబై కోసం తాను తీసుకొచ్చిన పథకాలను వివరించారు.
మరోవైపు శివసేన ముఖ్యనేత సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిశారు. అయితే, తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని గతంలోనే ఎన్సీపీ స్పష్టం చేసింది. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa