ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిషబ్ పంత్ కొంచెం సమయం ఇవ్వండి: గంగూలీ

national |  Suryaa Desk  | Published : Sat, Nov 09, 2019, 01:33 PM

బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో తన పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దుతగా నిలిచాడు. పంత్ సూపర్ ప్లేయర్ అని... నెమ్మదిగా పరిపక్వం చెందుతాడని త్వరలోనే మంచి ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 21 ఏళ్ల రిషబ్ పంత్ వరల్డ్‌కప్ తర్వాత నుంచి పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో సైతం అటు బ్యాట్‌తోనూ ఇటూ స్టంప్స్ వెనుకన ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో గంగూలీ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "పంత్ అద్భుతమైన ఆటగాడు. అతడికి కొంత సమయం ఇవ్వండి, మంచి ప్రదర్శన చేస్తాడు. అతడు నెమ్మదిగా పరిపక్వం చెందుతాడు, మీరు అతనికి సమయం ఇవ్వాలి. గత రాత్రి టీమిండియా చాలా బాగా ఆడింది" అని అన్నాడు. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ విషయంలో మాత్రం ఇంకా ఆందోళనగానే ఉంది. బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయిన పంత్‌.. అటు కీపింగ్‌లో కూడా మెప్పించలేకపోతున్నాడు. తొలి టీ20లో డీఆర్‌ఎస్‌ విషయంలో రోహిత్ శర్మను బోల్తా కొట్టించగా.. రెండో టీ20లో అత్యుత్సాహం ప్రదర్శించి బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ను స్టంపౌట్‌ నుంచి కాపాడాడు. తన తొందరపాటు వల్ల అభిమానులతో పాటు జట్టు సభ్యులను కలవర పెట్టాడు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ వేసిన మూడో బంతిని లిటన్‌ దాస్‌ క్రీజు వదిలి ముందుకువచ్చి ఆడాలని ప్రయత్నించాడు. పంత్‌ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో లిటన్ పెవిలియన్ బాటపట్టాడు. అయితే ఆ బంతిని చెక్ చేసిన థర్డ్‌అంపైర్.. నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఐసీసీ 40.3 నిబంధన ప్రకారం.. బ్యాట్స్‌మన్‌ శరీరం లేదా బ్యాట్‌కు తాకని బంతి వికెట్లను దాటి వచ్చిన తర్వాతే కీపర్ అందుకుని స్టంప్‌ చేయాలి. కీపర్ గ్లౌజ్‌లోని ఏ భాగమైనా వికెట్‌కంటే ముందు ఉంటే.. అది నోబాల్ కిందే లెక్క. ఇక్కడ బంతిని పంత్‌ వికెట్లకు కాస్త ముందుగానే అందుకుని స్టంప్‌ చేశాడు. అది నోబాల్ అవ్వడంతో థర్డ్‌అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కాగా, మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 నాగ్ పూర్ వేదికగా ఆదివారం జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa