ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ఆర్సీ బిల్లుపై సీఎం జ‌గ‌న్‌ యూటర్న్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2019, 09:33 PM

ఎన్ఆర్సీ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఎన్ఆర్సీ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గతంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా చెప్పిన మాటలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఎన్ఆర్సీకి సంబంధించి అంజద్ బాషా తనతో చర్చించిన తర్వాతనే ప్రకటన ఇచ్చారని వెల్లడించారు. తామంతా పూర్తిగా ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళం విప్పినట్లు చెప్పారు. ఎన్ఆర్సీకి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ప్రతి ముస్లింకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)కు మద్దతుగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ ఓటేసింది. దీంతో రాజ్యసభలో బొటాబొటీ మెజారిటీతో సీఏబీ గట్టెక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి ఏపీలో బలమైన మద్దతుదారులుగా ఉన్న ముస్లింలు సీఎంపై బహిరంగానే వ్యతిరేకత ప్రదర్శించారు. దీంతో ఎన్ఆర్సీ, సీఏబీకి ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వబోదని డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రకటన చేశారు. కానీ, సీఎం జగన్ మాత్రం బహిరంగంగా ఎలాంటి వ్యతిరేక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతంగా మారాయి. బీజేపీకి పూర్తి వ్యతిరేక ఫలితాలు రావడంతో సీఏఏ, ఎన్ఆర్సీలపై దేశ ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని జగన్ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కడప పర్యటనలో సీఎం జగన్ బహిరంగంగా మొట్టమొదటి సారి ఎన్ఆర్సీపై స్పందించారు. పౌరసత్వ బిల్లులకు సంబంధించి పార్లమెంటులో కేంద్రానికి అనుకూలంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌సీసీ అధినేత.. ప్రజా వ్యతిరేకత, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యూటర్న్ తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa