ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ బాండ్ ధరల్ని ప్రకటించిన ఆర్బీఐ,,,,గ్రాముపైనే రూ. 11 వేల లాభం

business |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 11:46 PM

బంగారం ధర ఇటీవల భారీగా పెరుగుతోంది. ప్రతి రోజూ సరికొత్త గరిష్ఠ స్థాయిల్ని తాకుతూనే ఉంది. ఇవాళ కూడా మరోసారి గోల్డ్ రేటు భారీగా పెరిగింది. దీంతో బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్లు చేసిన వారికి కాసుల వర్షం కురుస్తోంది. బంగారంపై పెట్టుబడికి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇక్కడ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను.. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. గతంలో తరచుగా ఈ గోల్డ్ బాండ్లను జారీ చేయగా.. వీటిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి తర్వాత నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందన్న కారణంతో వీటిని తాత్కాలికంగా నిలిపివేసింది. అయినప్పటికీ.. గతంలో జారీ చేసిన బాండ్లపై.. రాబడి మాత్రం అందిస్తోంది.


  వీటి కాలవ్యవధి 8 సంవత్సరాలుగా ఉంటుంది. ఐదేళ్ల తర్వాత కూడా ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ బాండ్లను నిలిపివేసినప్పటికీ.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి రిటర్న్స్ అందించాల్సి ఉంటుంది. వీటిని ఇష్యూ చేసిన ఐదేళ్ల తర్వాతి నుంచి రిడెంప్షన్ ధరల్ని ప్రకటిస్తుంటుంది ఆర్బీఐ. ఇప్పుడు 2017-18 సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) సిరీస్- XIII ఫైనల్ రిడెంప్షన్ ధరను (తుది విమోచన ధర) ప్రకటించింది.


ఈ గోల్డ్ బాండ్ సిరీస్‌ను 2017, డిసెంబర్ 26న ఇష్యూ చేయగా.. ఇప్పుడు 2025, డిసెంబర్ 26 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. తుది విమోచన ధర గ్రాముకు రూ. 13,563 గా నిర్ణయించింది. డిసెంబర్ 22, 23, 24.. ఇలా 3 రోజుల సగటు ధర ఆధారంగా రిడెంప్షన్ ప్రైస్ నిర్ణయించింది. అయితే ఇక్కడ 2017లో జారీ చేసినప్పుడు ఇష్యూ ధర గ్రాము లేదా యూనిట్‌కు కేవలం రూ. 2,866 గానే ఉంది.


ఆన్‌లైన్‌లో అప్లై చేసి.. డిజిటల్ పేమెంట్ చేస్తే గ్రాముపై రూ. 50 చొప్పున డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ గ్రాము ధర రూ. 2,816 అయింది. ఈ లెక్కన గ్రాముపై రూ. 13,563- 2,816= రూ. 10,747 లాభం వచ్చింది. ఇది శాతం పరంగా చూస్తే 381 శాతం కంటే ఎక్కువే. అంటే 2017లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 3.82 లక్షల లాభం వచ్చింది. అంటే లక్ష రూ. 4.82 లక్షలైంది. ఇంకా వార్షిక ప్రాతిపదికన 2.50 శాతం చొప్పున వడ్డీ కూడా వస్తుంది. దీంతో 8 ఏళ్లలో చూస్తే ఈ వడ్డీతో రాబడి ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్పొచ్చు. లక్ష రూ. 5 లక్షలకుపైనే అయిందన్నమాట. ఇదే రూ. 2 లక్షల పెట్టుబడితో రూ. 10 లక్షల వరకు వచ్చి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa