యువత అంటే దేశానికి పట్టుకొమ్మలని పెద్దలు చెబుతుంటారు. మరి నేటితరం యువకులలో వ్యసనాలకు బానిసైనవారు కోకొల్లలు. కష్టపడకుండా డబ్బును అక్రమ పద్దతిలో సంపాదించాలని చాలా మంది యువతీయువకులు కటకటాలపాలైన సంగతి తెలిసిందే. తాజాగా రామనాథపురంలో ఓ ఘటన చోటుచేసుకుంది. మహిళలు, వివాహమైన వారిని టార్గెట్ చేయడం, వారి చిత్రాలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. రామనాథపురం పరమకుడికి చెందిన ఓ ఉద్యోగి శుక్రవారం ఎస్పీ వరుణ్కుమార్కు ఓ ఫిర్యాదు చేశాడు. తన భార్య చిత్రాల్ని మార్ఫింగ్ చేసి ఎవరో ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆమె తీవ్ర ఆందోళనతో ఉందని తెలిపాడు. తాను ఆ యువకుడితో మాట్లాడగా రూ. 20 వేలు ఇస్తే సరి అని, ఇవ్వకుంటే సోషల్ మీడియాలో ఆ ఫొటోల్ని పెడుతానని బెదిరిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదును తక్షణం పరిగణనలోకి తీసుకున్న ఎస్పీ ఓ బృందాన్ని రంగంలోకి దించారు. ఆ నగదు తీసుకునేందుకు శనివారం ఓ చోటకు వచ్చిన ఆ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ యువకుడు ఓ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు, అతడు ఉలగనాథపురానికి చెందిన రోహిత్ అని తేలింది. సరిగ్గా మీసాలు కూడా రాని ఇతడు ఫేస్ బుక్, టిక్ టాక్, వాట్సాప్ల ద్వారా యుక్త వయస్సు దాటిన వాళ్లు, వివాహమైన మహిళల్ని టార్గెట్ చేశాడు. వారితో పరిచయాలు పెంచుకోవడమే కాదు, వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వారికే పంపించడం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కిస్తానని బెదిరించడం, కొందర్ని లొంగ దీసుకున్నట్టు, మరి కొందరి వద్ద నగదు దోచుకున్నట్టు విచారణలో తేలింది. నిందితున్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ వరుణ్కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa