ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్లు అలర్ట్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 05:43 PM

ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ కు సంబంధించిన మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేసే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సార్లు మీకు బ్యాంక్ ప్రతినిధులమంటూ కొన్ని కాల్స్ వస్తాయి. మెల్లగా మీలో నమ్మకం కలిగించి మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి వివరాలు అడగాలని చూస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీరు వెంటనే కాల్ కట్ చేసేయండి. మీ బ్యాంకింగ్ వివరాలు వారికి చెప్పారంటే క్షణాల్లో మీ ఖాతాలో నగదు ఖాళీ అయిపోతుంది. మనం వివిధ బ్యాంకు ఖాతాలు ఉపయోగించేటప్పుడు దానికి తగ్గట్లు వివిధ యూపీఐ అకౌంట్లు కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యూపీఐ సెట్టింగ్స్ చేసుకునేటప్పుడు మీరు ఎవరి సాయం తీసుకోకుండా మీ అంతట మీరే యూపీఐ సెటప్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వేరే వారి సాయం తీసుకుంటే మీ మొబైల్ నంబర్, యూపీఐ ఐడీ, పిన్ ఆధారంగా వారు మీ ఖాతాలో సొమ్ము తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీరు ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్(ఓటీపీ)లను, పిన్ లను ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయకండి. వీటి ద్వారా కూడా ఈ మధ్య కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా కాల్ చేసి ఓటీపీ చెప్పమని అడిగిన చెప్పకండి. ఆన్ లైన్ మోసాలు చేసేవారు మీ బ్యాంకింగ్ వర్చువల్ పేమెంట్ అడ్రెస్(వీపీఏ) ఐడీ ద్వారా ఓటీపీ, పిన్ నంబర్లతో సంబంధం లేకుండా వారంతట వారే ఎంపిన్ (ఎంపిన్) సెట్ చేసుకుని మీ ఖాతా నుంచి లావాదేవీలు చేసి నగదు కాజేస్తారు. కాబట్టి ఎవరైనా కాల్ చేస్తే కనీసం మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చెప్పకండి. మీ మొబైల్ ఫోన్ కు తెలియని నంబర్ల నుంచి ఏదైనా అనుమానాస్పద లింకులు వస్తే వాటిని పొరపాటున కూడా ఓపెన్ చేయవద్దు. వాటి ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేసి బ్యాంకింగ్ వివరాలతో పాటు, మీ ఫోన్ లో ఉన్న వ్యక్తిగత సమాచారం కూడా తస్కరించే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మీకు డబ్బులు పంపిస్తామని చెప్పి, రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా మీ ఖాతాలో నగదు తస్కరించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యూపీఐ ఖాతాలకు లావాదేవీలకు గురించిన నోటిఫికేషన్లు వచ్చినప్పుడు అది ‘సెండ్’ ఆ ‘రిసీవ్’ ఆ అని చూసుకోండి. సెండ్ అని వస్తే మీకు ఖాతాలో నగదు జమ అయినట్లు, రిసీవ్ ద్వారా వస్తే మీ ఖాతా నుంచి నగదును వారు అభ్యర్థిస్తున్నట్లు అన్నమాట. కాబట్టి ఆ రిసీవ్ మీద క్లిక్ చేసి మీరు ఆ లావాదేవీని పూర్తి చేసినట్లయితే మీ ఖాతాలో నగదు ఖాళీ అవుతుంది. మీ ఖాతా నుంచి డబ్బు తీసుకోవడానికి మాత్రమే ఓటీపీ అవసరం అవుతుంది. అంతేకానీ వేరే వారి నంబర్ నుంచి మీ నంబర్ కి నగదు ట్రాన్స్ ఫర్ చేయడానికి ఓటీపీ అవసరం లేదు. ఆ విషయం మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ జాగ్రత్తలు పాటించి మీ ఖాతాలో ఉన్న నగదును ఎవరూ తస్కరించకుండా జాగ్రత్త పడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa