ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతాప్‌గఢ్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 05, 2020, 11:39 AM

అతి వేగం.. నిర్లక్ష్యం తొమ్మిది మంది ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాలను అనాథలను చేసింది. శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా వాజిద్‌పూర్-నవాబ్‌గంజ్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.


రాజస్థాన్‌లో తమ బంధువుల ఇంట్లో ఓ శుభ కార్యానికి హాజరైన ఓ కుటుంబం తమ స్వస్థలం బిహార్‌లోని భోజ్‌పూర్‌కు స్కార్పియో వాహనంలో బయలుదేరింది. డ్రైవర్ సహా పదిమంది ఈ వాహనంలో బయలుదేరారు. ఈ తెల్లవారు జామున మార్గమధ్యలో ప్రతాప్‌గఢ్ జిల్లా వాజిద్‌పూర్-నవాబ్‌గంజ్ సమీపంలోకి రాగానే స్కార్పియో ఓ ట్రక్కును ఎదురుగా ఢీ కొట్టింది. ఎంత బలంగా ఢీ కొట్టిందంటే.. స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.ఇంజిన్ డ్రైవర్ సీట్లోకి చొచ్చుకుని వచ్చింది.స్కార్పియోలో ప్రయాణిస్తోన్న 10 మందిలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతణ్ని ప్రతాప్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లక్నోకు తీసుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే ప్రతాప్‌గఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, నవాబ్‌గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.


అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అంతకుముందే వర్షం పడిందని, వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ.. వాహనాన్ని వేగంగా నడిపించినట్లు స్పష్టం చేశారు. ప్రమాదం చోటు చేసుకునే సమయానికి స్కార్పియో వాహనం 100 కిలోమీటర్ల వేగానికి మించి ప్రయాణించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. నిద్రమత్తు కూడా ఓ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నామని అన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa