ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ మాల్యాకు షాక్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 12:39 PM

కోర్టు ధిక్కారం కేసులు దోషిగా తేలిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విజయ్ మాల్యా బదిలీ చేసినట్టు రుజువు కావడంతో ఆయనను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణం తీసుకుని, ఎగవేసిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే.


విజయ్ మాల్యా పిటిషన్‌పై గత గురువారం విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. కోర్టు ధిక్కారం కేసులో దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఆయన కోరగా.. ఇందుకు నిరాకరించింది.మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను బదిలీ చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో, 2017 మేలో ఆయనను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని మాల్యా కోరారు. ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం మాల్యా పిటిషన్‌ను తోసిపుచ్చింది


విచారణలో మాల్యాపై రెండు ఆరోపణలు ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆస్తుల వివరాలు వెల్లడించడం, సొమ్మును అక్రమంగా బదిలీ చేయడం అనే రెండు ఆరోపణలు ఉన్నాయని పేర్కొంది. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఇతర సంస్థల కోసం విజయ్ మాల్యా దాదాపు రూ.9,000 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణాలను ఆయన తిరిగి చెల్లించడం లేదని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఆరోపించింది. ఆయన ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు.


బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన కేసులో మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వివిధ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ, ఆయన తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేశారని ఈ కన్సార్షియం ఆరోపించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa