జమైకా: బలహీన వెస్టిండీస్పై ఊహించిన స్థాయిలో కాకపోయినా.. మొత్తానికి వన్డే సిరీస్ గెలిచింది టీమిండియా. చివరిదైన ఐదో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలిచి ఐదు వన్డేల సిరీస్ను 3-1తో ఎగరేసుకుపోయింది. 206 పరుగుల లక్ష్యాన్ని 36.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది కోహ్లి సేన. రన్మెషిన్ కెప్టెన్ విరాట్ చేజింగ్లో మరో సెంచరీతో చెలరేగాడు. అతనికి దినేష్ కార్తీక్ (50) తోడవడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది. విరాట్ 115 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వన్డేల్లో అతనికిది 28వ సెంచరీ కావడం విశేషం. చేజింగ్లో ఇది 18వ సెంచరీ.
నాలుగో వన్డేలో 190 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడిన టీమిండియా.. ఈ మ్యాచ్లో మళ్లీ చాంపియన్ ఆటతీరుతో అదరగొట్టింది. 206 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్.. 5 పరుగులకే ఓపెనర్ ధావన్ (4) వికెట్ కోల్పోయినా.. తర్వాత వచ్చిన కోహ్లి విండీస్ బౌలర్లతో ఆడుకున్నాడు. మొదట రహానే (39)తో రెండో వికెట్కు 79 పరుగులు, తర్వాత మూడో వికెట్కు దినేష్ కార్తీక్ (52 బంతుల్లో 50)తో కలిసి 122 పరుగులు జోడించాడు. విరాట్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.
అంతకుముందు పేస్ బౌలర్లు షమి (4), ఉమేష్ యాదవ్ (3) ధాటికి విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 రన్స్ మాత్రమే చేయగలిగింది. షాయ్ హోప్ (51), కైల్ హోప్ (46) మాత్రమే రాణించారు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయకపోయినా.. కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా విండీస్ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచారు. పేసర్లు వికెట్లు తీసి విండీస్ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. ఐదు వన్డేల సిరీస్లో తొలి వన్డే రద్దవగా.. రెండు, మూడు, ఐదో వన్డేల్లో గెలిచిన భారత్ 3-1తో సిరీస్ గెలిచింది. ఆదివారం విండీస్తో ఏకైక టీ20లో తలపడనున్నది విరాట్ సేన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa