ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు

national |  Suryaa Desk  | Published : Mon, Apr 26, 2021, 10:57 AM

గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటిన ప్రాంతాల్లో.. అలాగే ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌ డౌన్‌ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం రాత్రి రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో స్థానికంగా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయాప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది.


మార్గదర్శకాలు ఇవే..


- అత్యవసరం కాని కార్యకలాపాలను రాత్రిపూట పూర్తిగా నిషేధించాలి.


- సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత, ఉత్సవ సంబంధమైన సమూహాలు, సమావేశాలను నిషేధించాలి.


- అన్ని రకాల షాపింగ్‌ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్‌ లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్, మతపరమైన స్థలాలు పూర్తిగా మూసేయాలి.


- పెళ్లిళ్లకు 50 మంది వరకు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతివ్వాలి.


- ప్రజా రవాణా గరిష్ఠంగా 50% సామర్థ్యంతోనే నడవాలి.


- ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ గరిష్ఠంగా 50% సామర్థ్యంతో పనిచేయాలి. కరోనా లక్షణాలు కనిపించిన వారికి ఎప్పటికప్పుడు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించాలి.


- రాష్ట్ర ప్రభుత్వాలు 10% పాజిటివిటీ మించిన ప్రాంతాలన్నింటినీ ఇందులోకి తీసుకొచ్చి కట్టడి చర్యలు చేపట్టాలి. ఈ ఆంక్షలను 14 రోజులపాటు కొనసాగించాలి.


- ఏదైనా ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ ప్రాంతంగా ప్రకటించే ముందు బహిరంగంగా వెల్లడించాలి.


- కరోనా నిబంధనల అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలి.


- హైరిస్క్‌ కేసుల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి చర్యలు చేపట్టాలి.


- కొవిడ్‌ ఆసుపత్రుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్‌ జిల్లా అధికారులకు అప్పగించాలి. అవసరమైన సంఖ్యలో ఆంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. - నిబంధనలకు అనుగుణంగానే రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమాబ్‌ లాంటి మందులు ఇవ్వాలి.


- అర్హులైన వారందరికీ 100% వ్యాక్సినేషన్‌ అమలుకు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.


- కఠిన ఆంక్షలపై ప్రజలను అప్రమత్తం చేయాలి.


- కంటెయిన్‌మెంట్‌ ను ప్రకటించే ముందు ప్రజలు నిత్యావసరాలు సమకూర్చుకొనేందుకు తగిన సమయం ఇవ్వాలి.


- కరోనా సోకిన వారు స్వయంగా వెల్లడించేలా విస్తృత ప్రచారం, హెచ్చరిక సంకేతాలు ఇవ్వాలి.


- పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి? వైద్య సౌకర్యాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అంబులెన్స్‌ ల సమాచారంపై విస్తృత ప్రచారం చేయాలి. వేగంగా సమాచారం అందించడానికి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలి. అవసరమైన వారికి వైద్యసేవలు అందించడంలో జాప్యం లేకుండా చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa