కర్నూలు: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెలుగోడు పట్టణంలో రాష్ట్రంలోని ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఒక్క అవకాశం పేరుతో అనేక హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రత్యేకించి సీఎం జగన్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి మాట తప్పి. మడమ తిప్పే పాలన సాగించడం సిగ్గుచేటని విమర్శించారు. మద్యనిషేధం చేస్తానని మాయ మాటలు చెప్పి మద్యం పేరిట రుణాలను తెచ్చుకోవడం హేయమని అన్నారు. ఓటీఎస్ పేరిట గతంలో నిర్మించిన గృహాలకు డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నవరత్నాల పేరిట ప్రజలకు తెలియని పథకాల కోసం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేశారని అన్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మహిళలను దూషించడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నారపు శేషిరెడ్డి, ఖలీలుల్లాఖాన్, మాజీ ఎంపీపీ ఎల్లాల కృష్ణుడు, మాజీ సర్పంచ్ అబ్దుల్కలాం, ఆత్మకూరు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa