గుంటూరు: నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మేడికొండూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పోలీసు కార్యాలయంలో నిందితుల వివరాలను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన ఉడుతూరి వెంకటనారాయణరెడ్డి సులువుగా డబ్బులు సంపాదించడానికి నకిలీ నోట్లు ముద్రించి మార్చి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. అదే గ్రామానికి చెందిన జంగం శ్రీనివాసరావు గతంలో నకిలీ నోట్ల కేసులో అరెస్టైన విషయం తెలుసుకున్న వెంకటనారాయణరెడ్డి అతడిని సంప్రదించాడు. నకిలీ నోట్లు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు దాచేపల్లికి చెందిన షేక్ జానీబాషాను కలుపుకున్నారు.
దాచేపల్లి మండలం నడికూడి గ్రామం చివర రహస్యంగా నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించారు. రూ. 5 వేలు అసలు నోట్లు ఇస్తే రూ. 20 వేలు నకిలీ నోట్లు ఇచ్చేవారు. వీరి వద్ద గుంటూరు వెంకటరమణకాలనీకి చెందిన గుంజి అంకమ్మరాజు, లాల్పురానికి చెందిన దేవళ్ల శ్రీనివాస్, అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన జెట్టి కిషోర్, ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన పంతగాని పూర్ణచంద్రరావులు నకిలీ నోట్లు తీసుకొని మార్చుకుంటున్నారు. రద్దీకూడళ్లు, పెట్రోలు బంకులు, జాతీయ రహదారిపై దుకాణాలు, మద్యం షాపుల్లో నకిలీ నోట్లు ఇచ్చి వస్తువులు కొనుగోలు చేసేవారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీటిని మార్చేవారు.
ఈ క్రమంలో ఈనెల 22న పేరేచర్లలోని ఓ మద్యం దుకాణంలో ఇద్దరు వ్యక్తులు రూ. 200 నకిలీ నోటు ఇచ్చి మద్యం కొనుగోలు చేసి వెళ్లారు. దుకాణ సేల్స్మెన్ నగదును లెక్కపెట్టే క్రమంలో నకిలీ నోటును గుర్తించి మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నోట్లు మార్పిడి చేసినవారితోపాటు తయారీ ముఠాను పట్టుకోవాలని అర్బన్ ఎస్పీ ఆదేశించారు. సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి పర్యవేక్షణలో సీఐ మారుతి కృష్ణ లోతుగా దర్యాప్తు చేశారు. నడికూడి గ్రామం చివర నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించారు. డీఎస్పీ, సీఐతోపాటు ఎస్సై ఆరోగ్యరాజు, సిబ్బంది వెళ్లి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
గత ఆరు నెలలుగా అక్కడ నకిలీ నోట్లు ముద్రిస్తున్నారని, ఇప్పటికే రూ. 2. 20 లక్షలు చలామణి చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద రూ. 45. 05 లక్షల విలువ చేసే నకిలీ నోట్లు, కంప్యూటర్, స్కానర్, ప్రింటర్, రెండు కార్లు జప్తు చేసినట్లు తెలిపారు. ముఠాను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రం అందించి అభినందించారు. ఏఎస్పీ గంగాధరం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa