ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మిర్చి...షేక్ రషీద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 11:55 PM

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో చెలరేగడంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడానికి కారణమైన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ప్రతిపాడులోని మల్లయ్య పాలెం. తండ్రి బలీషా వలీ లోన్‌ రికవరీ ఏజెంట్‌గా పనిచేసే చిరుద్యోగి. వలీ సంపాదన అంతంత మాత్రమే అయినా కొడుకు ఆసక్తిని గమనించి అతడికి ఏడేళ్ల వయసునుంచే క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. తొమ్మిదో ఏటనే అండర్‌-14 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రషీద్‌ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అంతర్‌ జిల్లాల పోటీల్లో భాగంగా శ్రీకాకుళంపై పన్నెండేళ్ల వయస్సులోనే ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన రషీద్‌ను స్థానికులు చిచ్చర పిడుగుగా పిలుస్తుంటారు. కోచ్‌ కృష్ణారావు దగ్గర క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఆంధ్ర అండర్‌-19 టీమ్‌ చీఫ్‌ కోచ్‌ జ్ఞానేశ్వరరావు దగ్గర రాటు దేలాడు. బంతిని అంచనా వేయడంలో, షాట్ల ఎంపికలో అద్భుతమైన నైపుణ్యం దొరకబుచ్చుకున్న రషీద్‌ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే కనీసం హాఫ్‌ సెంచరీ బాదకుండా పెవిలియన్‌ చేరడు. విరాట్‌ కోహ్లీని అమితంగా ఆరాధించే రషీద్‌కు అతని పోరాట పటిమంటే చాలా ఇష్టం. సీనియర్లు శ్రీకర్‌ భరత్‌, కేవీ శశికాంత్‌తో సన్నిహితంగా ఉండే రషీద్‌ అవసరమైనప్పుడు వారి సలహాలు తీసుకుంటుంటాడు. ఇదిలావుంటే అండర్-19 ఆసియా కప్ టోర్నీలో 108 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 90 నాటౌట్గా నిలిచిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa