ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలజడి...పంజాబ్ సరిహద్దుల్లో పాక్ పడవ

international |  Suryaa Desk  | Published : Sat, Jan 08, 2022, 06:13 PM

కరోనా వేళ యావత్తు ప్రపంచం వణుకుతుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పంజాబ్‌లోని ఫిరోజ్‌‌‌‌పూర్ జిల్లాలో సరిహద్దు ఔట్ పోస్టు సమీపంలో ఓ పాకిస్థాన్ పడవను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. 136వ బెటాలియన్‌కు చెందిన సిబ్బంది డీటీ మాల్ బార్డర్ ఔట్ పోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చెక్క బోటు కనిపించింది. తర్వాత బీఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీలు చేశారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తెలియజేయాలని గ్రామస్థులకు చెప్పారు. అయితే ఇలాంటి బోట్లను మత్తు పదార్థాల రవాణాకు ఉపయోగిస్తారని అధికారులు అన్నారు. ఫిరోజ్‌పూర్ పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున సున్నితమైన జిల్లా. ఇటీవల కాలంలోనే పాకిస్థాన్ నుంచి అనేక డ్రోన్లు ఈ భూభాగంలోకి వచ్చాయి. కాగా పంజాబ్‌ పర్యటనలో భాగంగా భద్రతా లోపంతో ఫిరోజ్‌పూర్‌లోని ఓ వంతెనపై ప్రధాన మంత్రి కాన్వాయ్ 20 నిమిషాలు నిలిచిపోయింది. దీంతో ప్రధాని భద్రత అంశం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సమీపంలోనే పాకిస్థాన్ బోటును గుర్తించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల కాలంలో ఇంటెలిజెన్స్ వర్గాలు పంజాబ్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. గత నెల పంజాబ్‌లో లూథియాన కోర్టులో పేలుడు సంభవించింది. ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కశ్మీర్‌లో భద్రత ఎక్కువగా ఉండడంతో ఉగ్రవాదులు పంజాబ్‌ను టార్గెట్ చేసుకున్నాయని, ఏ క్షణమైన అక్కడ ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందని చెప్పాయి. ఈ క్రమంలో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఏది కనిపించినా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa