ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాంటి ముందస్తు హెచ్చరికలు వద్దు...కాల్చి చంపండి

international |  Suryaa Desk  | Published : Sat, Jan 08, 2022, 06:12 PM

‘కొందరు ఉగ్రవాదులు నిరసనలు తెలుపుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు.. పౌరులపై ఆయుధాలను ప్రయోగిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండానే వారిని కాల్చి చంపాలని పోలీసులను ఆదేశిస్తున్నా’ అని  శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోకజిఖిస్థాన్ అధ్యక్షుడు అధికార్లకు ఆదేశాలు జారీ చేశాడు. ఎల్పీజీ ధరల పెంపునకు నిరసనగా కజఖిస్థాన్‌లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చే పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్ సంచలన ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా నిరసన తెలియజేస్తున్నట్లు కనిపిస్తే కాల్చిపారేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. రాజ్యాంగాన్ని పునరుద్ధరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన కజిఖిస్థాన్ అధ్యక్షుడు... ‘కొందరు ఉగ్రవాదులు నిరసనలు తెలుపుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు.. పౌరులపై ఆయుధాలను ప్రయోగిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండానే వారిని కాల్చి చంపాలని పోలీసులను ఆదేశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 26 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే 3000 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. రాజధాని అల్మాటీలోని 70 చెక్‌పాయింట్ల వద్ద పోలీసులు నిత్యం గస్తీ కాస్తున్నారు. మరోవైపు, అల్మాటీలోకి ప్రవేశించిన నిరసనకారులు.. ప్రభుత్వ కార్యాలయాలను కూల్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి, పరిస్థితి చేజారడంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు సహా 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పోలీసు అధికారి తలను నిరసనకారులు నరికివేసి... వేలాది వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు దేశంలో పెరుగుతున్న అశాంతిని అదుపులోకి తెచ్చేందుకు అధ్యక్షుడు ఖాసిమ్.. రష్యా సాయం కోరారు.


అదనపు బలగాలను పంపాలని రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీవో)కి విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన రష్యా.. 70 విమానాల్లో భద్రతా బలగాలను పంపింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఖాసీం.. తమ దేశానికి ఈ సైన్యం సహాయపడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిరసనల నేపథ్యంలో.. అల్మాటీ, మాంగిస్టౌ ప్రావిన్స్‌ తదితర ప్రాంతాల్లో జనవరి 19 వరకు అత్యవసర పరిస్థితులు విధించారు. అంతర్జాల సేవలను నిలిపేశారు.


కజిఖిస్థాన్‌లో పరిస్థితులపై ఖాసిమ్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలుసార్లు ఫోన్ చేసి చర్చించారు. ఎల్పీజీ ధరల పెంపు.. ప్రభుత్వం, మాజీ అధ్యక్షుడు నూర్-సుల్తాన్ నజర్‌బయేవ్‌కు వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా సాగాయి. నజర్‌బాయేవ్ 2019లో టోకయేవ్‌కు బాధ్యతలను అప్పగించే వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. కజిఖిస్థాన్‌ను ఎక్కువ కాలం పాలించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. తన వంశం పేరుతోనే నూర్ సూల్తాన్ నగరాన్ని ఏర్పాటుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa