పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ఒక రోజంతా సంపూర్ణ లాక్ డౌన్ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో తమిళనాడు వ్యాప్తంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతించడం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ఆదివారం చేపట్టాల్సిన మెగా వ్యాక్సిన్ క్యాంపులను శనివారం నిర్వహించారు. ఎవరైనా లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రధాన రహదారులపై తిరిగే వాహనాలను తనిఖీ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అత్యవసర, ఔషధాల దుకాణాలు, పెట్రోల్ బంకులు పనిచేస్తున్నాయి. అనుమతి ఉన్న వాహనాలు, అంబులెన్స్లు, పాల వ్యానులు, దినపత్రికల వాహనాలు, ఇంధన ట్యాంకర్లు, నిత్యావసర సరుకుల లారీల సహా బస్సులు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులకు వెళ్లే ప్రయాణికుల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో శనివారం అన్ని మార్కెట్లు కిటకిటలాడాయి. ముఖ్యంగా కూర గాయలు, పండ్లు, చేపలు, మాంసం దుకాణాల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. కోయంబేడు మార్కెట్, కాశిమేడు చేపల మార్కెట్, చింతాద్రి పేట, పట్టిణంబాక్కం చేపల మార్కెట్లకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమిళనాడులో గత 24 గంటల్లో 10,971 కరోనా కేసులు నమోదయ్యాయి. చెన్నై నగరంలోనే 5,091 కొత్త కేసులు బయటపడ్డాయి. ఐదు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవాలని, కోవిడ్-19 ప్రోటోకాల్స్ పాటించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa