చిన్న పనిచేసినా దాంట్లో తన పేరు వచ్చేలా తపన పడే రోజులివి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం తీసుపోవు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనలోనే కాకుండా సింప్లసిటీలో తనదైన మార్క్ ను ప్రదర్శిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా అలాంటి ఓ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. పేదలకు తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా సరుకులను అందిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా గతవారం ప్రారంభించారు. మొత్తం 20 రకాలు వస్తువులతో కూడిన కిట్లను రాష్ట్రంలోని 2.15లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్లకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం రేషన్కార్డు దారులకు, శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రాల్లో ఉంటున్న శ్రీలంక తమిళులకు ఉచిత ‘పొంగల్’ కానుక పంపిణీ పథకం అందజేస్తున్నారు. మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. పసుపు, కారం, ధనియాల పొడి, ఆవాలు, మిరియాలు, జీలకర, నెయ్యి, చింతపండు, శెనగపిండి, మినుమలు, పెసర పప్పు, రవ్వ, ఉప్పు, గోధుమ పిండి, బెల్లం, పచ్చిబియ్యం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులు, చెరకుగడతో కూడిన ఈ కానుక పంపిణీ కొనసాగుతోంది. మొత్తం రూ.1296. 99 కోట్ల వ్యయంతో అర్హులైన 2.15 లక్షల కుటుంబాలకు ఈ సరకులను పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పొంగల్ కానుకలను రేషన్ షాపుల్లో టోకెన్ల పద్ధతిలో కొవిడ్ నిబంధనలతో పంపిణీ చేస్తున్నారు. అర్హులకు ఇళ్ల వద్దే టోకెన్లు ముందుగా అందజేసి, నిర్దేశించిన సమయంలో రేషన్ షాపులకు వెళ్లి కానుకలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ముఖ్యమంత్రి ఫోటో లేకుండానే ఈ కానుకలను అందజేయడం విశేషం. పొంగల్ విశిష్టతను తెలిపేలా చెరుక గడలు, ఎద్దు బొమ్మను సంచిపై ముద్రించారు. దీనిపై సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్టాలిన్ పేరును మాత్రమే ముద్రించారు మరోవైపు, పొంగల్ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 36,684 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, పూజారులు, భట్టా చార్యులు, ఓదువార్లకు కొత్త యూనిఫాం అందజేస్తున్నారు. సంక్రాంతి నుంచి వీరంతా కొత్త యూనిఫాంతో విధులకు హాజరవుతారని అధికారులు చెప్పారు. ఆలయ అర్చకులు, భట్టాచార్యులు, పూజారులకు నెమలి కంఠం రంగు అంచుకలిగిన ధోవతి., పూజారులు, ఆలయ సిబ్బందిగా పనిచేసే మహిళలకు లక్క రంగుతో పసుపు అంచు కలిగిన చీర, పురుషులకు గోధుమరంగు ఫ్యాంట్, చందనం రంగు చొక్కాను పంపిణీ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa