విమాన, హెలికాప్టర్ ప్రయాణాలు ఎంతటి సుఖాంతంగా ఉంటాయో వాతావరణ సహకరించకుంటే అంతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాలన్నీ దాదాపు వాతావరణం సహకరించకపోవడంవల్లే జరిగాయి. ఇదిలావుంటే ఓ ప్రయివేట్ హెలికాప్టర్ ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండ్ కావడంతో చుట్టుపక్కల పనిచేసుకుంటున్న రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత భయపడిన జనం అక్కడకు చేరుకుని అందులోని వారు సురక్షితంగా ఉండటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం అటవీ ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి కొచ్చి వెళుతున్న ప్రైవేటు హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కడంబూర్ కొండ ప్రాంతం పరిధిలోని పవలకుట్టై గ్రామ పొలాల్లో ల్యాండ్ అయింది. కర్ణాటకకు చెందిన భరత్ (65) అనే వ్యక్తి తన భార్య షీలా (60) అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం కేరళలోకి కొచ్చికి తీసుకెళ్లాలని భావించారు. దీంతో ప్రైవేటు హెలికాప్టర్ను అద్దెకు తీసుకుని బెంగళూరు నుంచి బయలుదేరారు. అయితే, హెలికాప్టర్ కడంబూర్ కొండ ప్రాంతం గుండా వెళుతుండగా మేఘాలు కమ్ముకోవడం, మంచు, ప్రతికూల వాతావరణం కారణంగా సిగ్నల్స్ అందలేదు. దీంతో పైలెట్ జస్పాల్ సమీపంలోని పొలాల్లో హెలికాప్టర్ను ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ కావడం గమనించిన అక్కడ పనిచేస్తున్నవారు ఆందోళనకు గురయ్యారు. అక్కడకు చేరుకుని హెలికాప్టర్లోని నలుగురు సురక్షితంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. హెలికాప్టర్లో భరత్, షీలాతోపాటు పైలెట్, ఇంజినీర్ ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కలవారు భారీగా గుమిగూడటంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి దాదాపు మూడు గంటలపాటు అక్కడే హెలికాప్టర్లో నిలిచిపోగా.. వాతావరణం అనుకూలించిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి కొచ్చి చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa