ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి రానున్నదని ఏబీపీ-సీఓటర్ ఓపీనియన్ పోల్ సర్వే తేల్చింది. జనవరి 2022 నాటికి బీజేపీ ఓటు షేర్ బాగా పెరిగింది. అత్యధికంగా 41.5 శాతం ఓట్లను బీజేపీ చేజిక్కించుకోనుంది. ఇక మాజీ సీఎం అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) 33.3 శాతం ఓటు షేర్ సాధించనుంది. ఇక బీఎస్పీ 12.9 శాతం, కాంగ్రెస్ 7.1 శాతం ఓటు షేర్ నమోదు చేయనున్నాయి. ప్రియాంక గాంధీ వాద్రా విస్తృత ఎన్నికల ప్రచారం కూడా ఆ పార్టీ ఓటు షేర్ ను పెంచే అవకాశం లేనట్లే తెలుస్తోంది. ఇదిలావుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఏబీపీ-సీ ఓటర్ ఓపినియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెలువరించింది. దేశంలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీ ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ పార్టీ మరోసారి సునాయాసంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించనుందని తాజా సర్వే తెలిపింది. మొత్తం 403 సీట్లలో 223-235 సీట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంది. హోరాహోరీగా పోటీ పడుతున్న అఖిలేష్ యాదవ్ ఎస్పీకి 145-157 వరకు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఘోరంగా విఫలమై 8-16 స్థానాలకే పరిమితం కానుంద.ి కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉండనుంది. కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లే దక్కే అవకాశం ఉందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. సుమారు లక్ష మంది వరకు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా యువకుల అభిప్రాయాలనే తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఓపీనియన్ సర్వే ఫలితాలను వెలువరించింది. గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. హంగ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa