ఎన్టీఆర్ను గద్దెదించిన సమయంలోనే పార్టీలో ఎన్టీఆర్ పేరును శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు యత్నించారని వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటే చంద్రబాబు నాయుడికి నరనరాన ఎనలేని ద్వేషం ఉందని, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయాలన్న నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోకపోవడం, టీడీపీ నేతలు స్వాగతించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను గద్దెదించిన సమయంలోనే పార్టీలో ఎన్టీఆర్ పేరును శాశ్వతంగా తొలగించాలని చంద్రబాబు యత్నించారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ పట్ల అభిమానం ఉన్న తమలాంటి వారు ఆనాడు చంద్రబాబు నాయుడి ప్రయత్నాలను గట్టిగా అడ్డుకున్నామని చెప్పారు. అప్పట్లో పార్టీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించలేదని, దీంతో ఎన్టీఆర్ వీరాభిమాని నెల్లూరు రమేశ్ రెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగా ప్రశ్నించారని రామచంద్రయ్య అన్నారు. ఆ విషయం మీడియాలో వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఎదురుతిరిగారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫొటోను సభ్యత్వ పుస్తకాలపై ముద్రించారని తెలిపారు. ఈ ఘటన జరిగిన అనంతరం రమేశ్ రెడ్డిని కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు దూరం పెట్టేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే, ఆ పేరు మళ్లీ ప్రజల్లో ప్రచారంలోకి వస్తుందని, దీంతో ఆయన వారసులైన నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వస్తుందని ఆయన అన్నారు. అలా జరిగితే తన కుమారుడు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. 2004–14 మధ్య ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ అప్పటి కేంద్ర సర్కారుని డిమాండ్ చేశారని, ఆ తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో 2014–18 వరకు నాలుగేళ్ల పాటు భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ను వినిపించలేదని చెప్పారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని, రూ.2కే బియ్యం వంటి పథకాలను తీసివేసింది చంద్రబాబు నాయుడేనని ఆయన అన్నారు. ప్రజలకు చరిత్ర తెలియదని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa