ఎనిమిది నెలల క్రితం అదృశ్యమైన భార్యకోసం ఆ భర్త వెతకని ప్రదేశమంటూ లేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినా ఈ రోజు వరకు ఆమె ఆచూకీ తెలియలేదు. చీరాల లో సంచలనం రేపుతున్న ఈ వివాహిత మిస్సింగ్ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
పాపరాజు తోట కు చెందిన మునగాల శివ పార్వతి(38)గత ఏడాది జూన్ ఏడో తేదీన ఇంటి నుండి మందుల కోసమంటూ బయలుదేరి వెళ్లి ఇక తిరిగి రాలేదు. వాస్తవానికి ఆమె భర్త మునగాల గిరిధర్, ఇద్దరు పిల్లలతో కలిసి సాయినగర్ లో ఉంటోంది. అయితే పాపరాజు తోటలో ఉండే తల్లికి అనారోగ్యంగా ఉండటంతో శివ పార్వతి ఆమెకు సాయంగా వెళ్లి అక్కడే కొన్ని నెలలుగా నివసిస్తోంది. భర్త, పిల్లలు సాయినగర్ లో ఉంటున్నారు.
మరి అక్కడ ఏం గొడవ జరిగిందో గానీ శివపార్వతి ఆ రోజున మందులు తెస్తానని చెప్పి బయటకు వచ్చేసి ఇక ఇంటికి తిరిగి వెళ్లలేదు. విషయం తెలుసుకున్న భర్త గిరిధర్ చీరాల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు 313/2021 నెంబర్ తో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత కూడా భర్త గిరిధర్ బంధువుల ఇళ్లలోనూ, ఆశ్రమాల్లోనూ, అన్ని చోట్ల వెతికినా, కరపత్రాలు పంచిపెట్టినా ఈరోజువరకు శివపార్వతి ఆచూకీ తెలియరాలేదు.
పోలీసులు కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సమీప పోలీస్ స్టేషన్లన్నింటికీ ఆమె వివరాలు పంపారు. అయినా ఆమె జాడ తెలియక గిరిధర్, ఆయన పిల్లల బాధ వర్ణనాతీతంగా ఉంది.
ఈ నేపధ్యంలో శివపార్వతి ఫొటో, ఇతర వివరాలతో కూడిన ప్రకటనను మీడియాకు సోమవారం విడుదల చేశారు. ఎవరికైనా ఆమె ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరారు. ఆచూకీ తెలియజేసిన వారికి తగిన పారితోషికం కూడా ఇస్తానని భర్త గిరిధర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa