ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు

international |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 03:11 AM

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పార్లమెంట్ వేదికగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.  బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ దేశీయంగా, అంతర్జాతీయంగా అవలంభించిన లోపభూయిష్ట విధానం భారత్‌ను రెండుగా విభజించిందన్నారు. ‘‘చైనా, పాకిస్థాన్‌‌లను వేర్వేరుగా ఉంచాలనేది భారత్‌ ఏకైక అతిపెద్ద వ్యూహాత్మక లక్ష్యం.. అయితే, మీరు (మోదీని ఉద్దేశిస్తూ) ఆ రెండు దేశాలూ కలిసేలా చేశారు. ఇదే మీరు చేసిన అతిపెద్ద నేరం’’ అంటూ రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘పాకిస్థాన్‌, పీపుల్స్‌ రిపబ్లిక్ ఆఫ్‌ చైనా మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నా.. అయితే ఆ వ్యాఖ్యలను (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) మేం కచ్చితంగా సమర్థించలేం’’ అని సమాధానమిచ్చారు. అంతేకాదు, పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఆ దేశంతో తమకు కీలకమైన బంధం ఉందని నెడ్‌ ప్రైస్‌ చెప్పడం గమనార్హం. ‘‘ప్రపంచంలోని ఏ దేశానికైనా అమెరికా, చైనాల మధ్య ఎంపిక అవసరం లేదని మేము అన్నింటికీ చెప్పాం.. అమెరికాతో సంబంధం ఎలా ఉంటుందో ఎంపికలను అందించడం మా ఉద్దేశం.. మాతో భాగస్వామ్యం విషయానికి వస్తే సాధారణంగా లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయని మేము భావిస్తున్నాం’’ అని అన్నారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ... మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథినీ ఎందుకు తీసుకురాలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోండి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ నేడు ఒంటరిగా మిగిలిపోయింది. బాహ్యశక్తుల నుంచి దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారు. వారు ఏం చేయాలనుకుంటున్నారనే దానిపై చైనాకు స్పష్టత ఉంది.. భారతదేశ విదేశాంగ విధానం ఏకైక అతిపెద్ద వ్యూహాత్మక లక్ష్యం పాకిస్తాన్ మరియు చైనాలను వేరుగా ఉంచడం. మీరు ఏమి చేసారు, మీరు వారిని ఒకచోట చేర్చారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa