'హిజాబ్' విషయంలో కర్నాటక ప్రభుత్వం, బిజెపి ఆర్ఎస్ఎస్ సంస్థలు చేస్తోన్న మత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ ఎస్. ఎఫ్. ఐ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థినీలు నిరసన చేపట్టారు. శుక్రవారం స్థానిక అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో సుమారు గంట పాటు రాస్తారోకో చేసి బిజెపి, కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు అరబిక్ కళాశాల నుండి ర్యాలీ చేపట్టారు. విద్యార్థల నిరసనలతో సుమారు గంట పాటు వినాయక సర్కిల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఈ నిరసన సందర్భంగా పలువురు ముస్లిం విద్యార్థినీలు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బంగిశివ మాట్లాడుతూ. రెండు నెలల్లో పరీక్షలు ఉండగా ఎప్పుడూ లేని పద్దతిలో విద్యాసంస్థల్లో హిజాబ్ పై వివాదం చేయడమేంటని మండిపడ్డారు.
బురఖా ధరించడం ముస్లిం మత సాంప్రదాయమని, హిందూ ముస్లిం కలిసిమెలిసి జీవిస్తున్న దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సాంప్రదాయాలపై దాడి చేయడం తగదన్నారు. కర్నాటక ప్రభుత్వ నిర్ణయంతో ముస్లిం విద్యార్థులు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. హిజాబ్ అనేది పెద్ద విషయం కాదని, విద్యా సంస్థలలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడం చాలా పెద్ద విషయమని అన్నారు. ఇది మన జాతీయ సమగ్రతకు చాలా హానికరమని, రాజకీయ ప్రయోజనాల బిజెపి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి విద్యను నేర్పేందుకు ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ ప్రకారం తమ మత సంప్రదాయాలు, దుస్తులు, ఆహారపుటలవాట్లను స్వేచ్ఛగా అనుసరించే హక్కు ప్రజలకు ఉందన్నారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa