రానున్న రోజుల్లో భారతదేశంలోని సామాన్యుడి పరిస్థితి తలకిందలయ్యే అవకాశముందా...? అంటే అవుననే సంకేతాలిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ద్రవ్యోల్బణంతో జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కేంద్రాన్ని అలర్ట్ చేశారు. రానున్న కాలంలో దీని వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చని అంచనా వేశారు. అంటే భావిష్యత్లో ధరలు మరింత పెరగనున్నాయని అంచనాకు రావొచ్చు. ఇదే జరిగితే సామాన్యులపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ దగ్గరి నుంచి గ్యాస్ సిలిండర్ వరకు పలు ప్రొడక్టుల ధరలు పెరిగిపోయాయి. టెలికం కంపెనీలు రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచేశాయి. వంట నూనె ధరలు కూడా పైకి చేరాయి. ఇలా ప్రజలు ధరల పెరుగుదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ధరల పెంపు వల్ల చాలా మంది ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో మళ్లీ ధరలు పెరగబోతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. వంట నూనె ధరలు, మసాలా దినుసులు ధరలు, మొబైల్ టారిఫ్ ధరలు మరోసారి పెరగనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే ఆయిల్ ధర 20 శాతం మేర పైకి చేరింది. అలాగే మసాలా దినుసులు ధరలు కూడా 25 శాతానికి పైగా పెరిగింది. కేడియా అడ్వైజరి డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ.. మసాలా దినుసుల ధరలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 71 శాతం మేర పైకి చేరయని తెలిపారు. ఈ ఏడాది తొలి నెల రోజుల కాలంలో వీటి ధరలు 25 శాతం మేర పెరిగాయని పేర్కొన్నారు. జనవరి15 నుంచి పసుపు సరఫరా పెరిగిందని, కానీ ధర మాత్రం 5 శాతం పెరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు చూస్తే జీలకర్ర ధర 25 శాతానికి పైగా. కొత్తిమీర రేటు 23 శాతానికి పైగా పెరిగింది. ఏడాది కాలంలో కొత్తిమీర ధర ఏకంగా 71 శాతం పెరగడం గమనార్హం. ఫిబ్రవరి 7న క్వింటాకు కొత్తిమీర ధర రూ.10,814గాఉంది. గత ఏడాదితో పోలిస్తే 70.82 శాతం పెరుగుదల నమోదైంది. జీలకర్ర ధర క్వింటాకు రూ.20,370గా ఉంది. ఏడాది కిందటితో పోలిస్తే 55 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే పసుపు ధర క్వింటాకు రూ.10,070గా ఉంది. 41 శాతం పెరిగింది. మార్చి నుంచి కొత్తిమీర, జీలకర్ర సరఫరా పెరుగుతుంది. అందువల్ల కొంత కాలం కొంత ఉపశమనం కలగొచ్చు. అయితే వచ్చే ఆరు నెలల కాలంలో పసుపు ధర క్వింటాకు రూ.12,500కు చేరొచ్చని కేడియా అంచనా వేశారు. అలాగే జీలకర్ర ధర క్వింటాకు రూ.25 వేలకు, కొత్తిమీర ధర క్వింటాకు రూ.18 వేలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. అంటే మసాలా దినుసుల ధరలు 24 నుంచి 66 శాతం మేర పైకి కదిలే ఛాన్స్ ఉంది. మరోవైపు మొబైల్ రీచార్జ్ ధరలు 2022లో మరోసారి పెరగొచ్చని ఎయిర్టెల్ సంకేతాలిచ్చింది. ఇంకా వంట నూనె ధరలు కూడా రానున్న రోజుల్లో పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa