ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాక్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులన్నీంటిని అమ్మేసుకుని.. అగ్గువకు ప్రైవేట్ వనరులను ఆశ్రయిస్తోంది అక్కడి ప్రభుత్వం.చివరకు.. అగ్రదేశాల నుంచి అప్పులు కూడా పుట్టని స్థితికి చేరుకుంది. ఈ స్థితిలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాక్ను అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంగీకరించాడు. ప్రభుత్వానికి, దేశ ప్రయోజనాలకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడమే అతిపెద్ద సమస్యగా పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్. ''అధికారంలోకి రావడానికి ముందు దేశంలో మార్పు తీసుకొస్తామని వాగ్దానం చేశా. కానీ, చెప్పినట్లు 'మార్పు' తీసుకురాలేకపోయాం. దీనికి దేశ ప్రజలు క్షమించాలి. అందుకు కారణం వ్యవస్థలోని లోపాలే. పుంజుకునేందుకు ప్రయత్నిస్తాం'' అంటూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను డాన్ న్యూస్పేపర్ యధాతధంగా ప్రచురించింది.అధికారంలోకి రాగానే.. మేము విప్లవాత్మక చర్యల ద్వారా వెంటనే మార్పు తేవాలనుకున్నాం. కానీ, మా వ్యవస్థ అప్పటికే దిగజారిన వ్యవస్థను సంగ్రహించలేకపోయింది. ప్రభుత్వం.. అందులోని మంత్రులం ఎవరం లక్ష్యాన్ని సాధించలేకపోయాం అని ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, దేశ ప్రయోజనాల మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య అని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్.
ఎగుమతులు, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం.. ఈ మూడు విషయాలపైనే దృష్టిసారించినప్పటికీ.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నాలు మొదలుపెట్టగా.. ఇలాంటి పరిస్థితిని తామూ ముందుగానే ఊహించానని, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించాడు ఇమ్రాన్ ఖాన్.
ఇదిలా ఉండగా.. పాక్ స్థితిని దిగజార్చిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ను గద్దె దించే ప్రయత్నాలు మొదలయ్యాయి. చేతకానీ దద్దమ్మ, అంతర్జాతీయ బిచ్చగాడు అంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు Imran Khanను ఏకీపడేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఇమ్రాన్ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని ఏ క్షణంలోనైనా నేషనల్ అసెంబ్లీలో(పాక్ పార్లమెంట్) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పాకిస్థాన్ డెమోక్రటిక్ మూమెంట్ పార్టీ పాక్ పార్లమెంట్లో అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సఫ్ పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక గీస్తోంది. ఒకవైపు నిరసన ప్రదర్శనలతో పాటు ఒకేసారి నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఝలక్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం పీపీపీ, పీఎంఎల్ ఎన్తో పాటు ఇమ్రాన్ జట్టు పార్టీలైన ఎంక్యూఎం, పీఎంఎల్ క్యూ సైతం ముందుకొస్తున్నాయి. మరోవైపు అధికార పక్షాన్ని వీడేందుకు పలువురు నేతలు సైతం సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ప్రతిపక్షాలకు తన మిత్ర పక్షాలు, సొంత పీటీఐ పార్టీ నేతలు తోడు కావడంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa