ప్రకాశం: రష్యా వైమానిక దాడుల నేపధ్యంలో వేటపాలెం మండలం దేశాయిపేట కు చెందిన యర్రా అఖిల అనే వైద్య విద్యార్థిని ఉక్రెయిన్ లో చిక్కుకుపోవడంతో ఇక్కడ ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రాణాలు రక్షించుకోవటానికి తాను బంకర్ ఉన్నానని, ఇప్పటి వరకు ఎటువంటి సమస్య ఎదురు కాలేదని అఖిల నుండి వారికి ఈ ఉదయం ఫోన్ లో సమాచారం అందింది. రెండు మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, భయాందోళనకు గురికావద్దని అఖిల తన తల్లిదండ్రులను ఊరడించింది.
వివరాల్లోకి వెళితే దేశాయిపేట ఐటిఐ కాలనీలో నివసించే ఎర్రా వేంకట సుబ్రహ్మణ్యం, మహేశ్వరిల సంతానమైన ఎర్రా అఖిల 2019వ సంవత్సరంలో ఉక్రెయిన్ లోఎంబీబీఎస్ చదువుకోటానికి వెళ్లింది. ఇప్పుడు మూడో సంవత్సరంలో ఉంది. చదువులో బాగా ముందుండే అఖిల్ మంచి మార్కులతో పాస్ అవుతూ వస్తోంది.
అయితే అకస్మాత్తుగా రష్యా దాడులు మొదలు కావడంతో ఉక్రెయిన్ లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. అఖిల కూడా అక్కడే ఇరుక్కుపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు అవధులు లేకుండా ఉంది. అయితే అదృష్టవశాత్తు ఫోన్లో వీడియో కాల్ కు అఖిల అందుబాటులోకి రావడంతో వారు కాస్తంత ఉపశమనం పొందారు.
ఆమె క్షేమ సమాచారం తెలిసి వారు కుదుటపడ్డారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వదేశానికి వచ్చేయమని ఆ తల్లి అఖిలకు కన్నీటితో చెబుతుండడం అందరినీ కదిలించి వేసింది. దేశాయిపేట గ్రామస్థులు ఆ కుటుంబీకులకు ధైర్యం చెబుతూ ఓదారుస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa