ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల అగచాట్లు.. రక్షించమంటూ ఆవేదన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 05:01 PM

రష్యా చేస్తున్నదాడులతో ఉక్రెయిన్‌‌ విలవిల్లాడుతోంది. అక్కడున్న భారతీయ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. జమ్మూ కశ్మీర్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎక్కువమంది విద్యార్థులు అక్కడున్నారు. అయితే వారిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ చాలా జాప్యం జరుగుతుంది. దీంతో తాము బాంబుల మోతలో భయాందోళనతో గడుపుతున్నామని, తమను రక్షించమని విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా మొరపెట్టుకున్నారు. త్వరగా తమను భారత దేశానికి తరలించమని వేడుకుంటున్నారు.


యుద్ధం మొదలవ్వక ముందు కొంతమంది విద్యార్థులను భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. ప్రస్తుతం యుద్ధం మొదలవ్వడంతో ఉక్రెయిన్ ఎయిర్‌ పోర్టును ఆ దేశ అధికారులు మూసివేశారు. అందువల్ల బుకారెస్ట్ నుంచి విమానాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ అధికారులు విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి రుమేనియా మీదుగా తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. రోడ్డు మార్గంలో రుమేనియా సరిహద్దుకు చేరుకున్న భారతీయ పౌరులను ప్రభుత్వ అధికారులు బుకారెస్ట్‌కు తీసుకువెళ్లి, తద్వారా వారిని రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో తరలిస్తున్నారు.


అయితే రుమేనియా వరకు భారతీ విద్యార్థులు రోడ్డు మార్గంలో చేరుకోవడం తలకు మించిన భారంగా మారింది. ఉక్రేనియన్ రాజధాని కైవ్, రుమేనియా సరిహద్దు చెక్ పాయింట్ మధ్య దూరం దాదాపు 600 కిలోమీటర్లు. రోడ్డు మార్గం ద్వారా అక్కడకు చేరుకోవడానికి ఎనిమిదిన్నర నుంచి 11 గంటల వరకు పడుతుంది. పైగా అక్కడ బస్సులు, రైళ్లు ఏమీ తిరగడం లేదు. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.


ఉక్రెయిన్‌లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు రుమేనియా బోర్డర్‌కు చేరుకోవడం చాలా కష్టతరంగా ఉంది. దీనికోసం కొంతమంది వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 50 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోని ఒడెసా నుంచి రుమేనియా బోర్డర్‌ వరకూ బస్సును బుక్ చేసుకున్నారు. దీనికోసం ఒక్కొక్క విద్యార్థి రూ. 4 లక్షల వరకూ చెల్లిస్తున్నారు. అంటే విద్యార్థులు కేవలం రుమేనియా బోర్డర్‌కు చేరుకోవడానికే లక్షల్లో చెల్లించాల్సి వస్తుంది.


ఒకవేళ ఆ డబ్బులు లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం కేవలం సలహా ఇవ్వడమే కాకుండా వారి పరిస్థితి గురించి ఏదైనా చేయాలని విద్యార్థులు, భారత దేశ జర్నలిస్టులు కోరుతున్నారు. యుద్ధం ఇంకా తీవ్రమైతే కనీసం ఈ పరిస్థితి కూడా ఉండే అవకాశం లేదని , వెంటనే భారత ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏదన్న చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa