173 ఏళ్ల చరిత్రలో భారతీయ రైల్వేలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ రైళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇక దేశంలోని సామాన్య ప్రయాణికుల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించిన సర్వీసుల్లో ఈ జనవరి నెల నుంచి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అదే సమయంలో ఇటీవలె హౌరా-గువహటి మధ్య దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇక వందే భారత్ రైళ్లు 2019లో ప్రారంభం కాగా.. ఇప్పటివరకు వందకు పైగా సర్వీసులు దేశంలోని కీలక నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి.
సామాన్యుల వందే భారత్గా పిలవబడే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు భారతీయ రైల్వే తాజాగా కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ రైళ్లలో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అమృత్ భారత్ రైళ్లలో అతిపెద్ద మార్పు ఏంటంటే 'రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్' (ఆర్ఏసీ) విధానాన్ని తొలగించడం. స్లీపర్ క్లాస్లో ఇకపై సగం సీటు కేటాయింపులు ఉండవని రైల్వే శాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అది నేరుగా కన్ఫర్మ్ అవుతుంది లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు సీటు కన్ఫర్మ్ అయిందా కాలేదా అనే విషయంలో స్పష్టత ఉంటుంది.
కనీస ఛార్జీల పెంపు
ఈ రైళ్లలో తక్కువ దూరం ప్రయాణించే వారికి ఛార్జీల భారం పడనుంది. స్లీపర్ క్లాస్లో ప్రయాణించాలంటే కనీసం 200 కిలోమీటర్ల దూరం చొప్పున ఛార్జీ చెల్లించాల్సిందే. ఈ అమృత్ భారత్ రైళ్లలో కనీసం రూ.149 వసూలు చేయనున్నారు. జనరల్ (అన్రిజర్వ్డ్) కోచ్లకు 50 కిలోమీటర్ల కనీస దూరం ప్రాతిపదికన రూ.36 నుంచి టికెట్ ధరలు ప్రారంభమవుతాయి.
హౌరా (పశ్చిమ బెంగాల్)- ఆనంద్ విహార్ (ఢిల్లీ)
సియాల్దా (పశ్చిమ బెంగాల్) - బనారస్ (ఉత్తర్ప్రదేశ్)
కామాఖ్య (అస్సాం)- రోహ్తక్ (హర్యానా)
న్యూ జల్పాయ్గురి (పశ్చిమ బెంగాల్)- నాగర్కోయిల్ (తమిళనాడు)
దిబ్రూగఢ్ (అస్సాం) - లక్నో (ఉత్తర్ప్రదేశ్)
న్యూ జల్పాయ్గురి (పశ్చిమ బెంగాల్)- తిరుచిరాపల్లి (తమిళనాడు)
అలీపుర్దూర్ (పశ్చిమ బెంగాల్)- బెంగళూరు (కర్ణాటక)
అలీపుర్దూర్ (పశ్చిమ బెంగాల్)- పన్వేల్ (మహారాష్ట్ర)
సంత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్)- తాంబరం (తమిళనాడు)
వందే భారత్కు భిన్నంగా..!
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పూర్తిగా ఏసీ, ప్రీమియం సదుపాయాలతో కూడిన రైలు కాగా.. అమృత్ భారత్ నాన్-ఏసీ (స్లీపర్, జనరల్) ప్రయాణికుల కోసం రూపొందించబడింది. ఇందులో సీసీటీవీ కెమెరాలు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆధునిక టాయిలెట్లు వంటి మెరుగైన వసతులు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa