ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్

national |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 08:05 PM

భారత పర్యటనకు వచ్చిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఘన స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి, ఢిల్లీ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో యూఏఈ అధ్యక్షుడికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ భారతీయ సంస్కృతి, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేక కానుకలను అందజేశారు. గుజరాతీ కుటుంబాల్లో తరతరాలుగా బంధాలకు కేంద్రంగా ఉండే, చేతితో చెక్కిన అందమైన చెక్క ఉయ్యాల ను బహుకరించారు. యూఏఈ 2026ను 'కుటుంబ సంవత్సరం'గా ప్రకటించిన నేపథ్యంలో ఈ కానుకకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో పాటు, కశ్మీర్‌కు చెందిన సుప్రసిద్ధ పష్మీనా శాలువాను తెలంగాణలో తయారైన వెండి పెట్టెలో పెట్టి అందజేశారు."నా సోదరుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. బలమైన భారత్-యూఏఈ స్నేహానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పర్యటన తెలియజేస్తోంది" అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. యూఏఈ అధ్యక్షుడి తల్లి షేఖా ఫాతిమాకు కూడా పష్మీనా శాలువాతో పాటు, వెండి పెట్టెలో కశ్మీరీ కుంకుమపువ్వును బహూకరించారు.ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ పర్యటన ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. గత దశాబ్ద కాలంలో యూఏఈ అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa