ఏ దేశమైన గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మానవ వనరులు చాలా కీలకం. అంటే.. పని చేసే వయసున్న వారు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.. ప్రస్తుతం యువతే భారత్కు అతిపెద్ద బలం అని. మన పొరుగు దేశం చైనా కూడా ఇదే మానవ వనరులతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. అయితే చైనాకు ఇప్పుడు కొత్త ముప్పు వచ్చింది. చైనాలో వరుసగా నాలుగో ఏడాది జనాభా తగ్గింది. దీంతో చైనాలో వృద్ధుల జనాభా కూడా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇలాగే కొనసాగితే శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఏర్పడుతుందనే విషయం చైనా గుండెలో గుబులు రేపుతోంది.
జనాభాకు సంబంధించిన గణాంకాలను సోమవారం (జనవరి 19) చైనా విడుదల చేసింది. వాటి ప్రకారం.. చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా తగ్గింది. 2025 ఏడాది చివరికి చైనాలో 140.4 కోట్ల జనాభా ఉంది. 2024తో పోలిస్తే 30 లక్షల జనాభా తగ్గినట్లు చైనా చెబుతోంది. ఇక 2025లో జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదు అయింది. గతేడాదితో పోలిస్తే.. 17 శాతం తక్కువ. అయితే ఇది చైనాకు ప్రతికూల అంశమని అక్కడి ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోందని వారు చెబుతున్నారు.
చైనాలో జనాభా ఎందుకు తగ్గుతోంది?
చైనాలో జనాభా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో డ్రాగన్ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ గణనీయంగా పెరిగింది. అందులో ముఖ్యంగా పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడుకుంటోంది. అలా పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు చదివించడం, ఇతర సౌకర్యాలు కల్పించాలంటే.. దాదాపు 76 వేల అమెరికన్ డాలర్లు ( భారత కరెన్సీలో సరాసరి రూ. 69 లక్షలు) ఖర్చు అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది యువత పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకాడున్నారని చెబుతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనేందుకు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
జననాల రేట్లు పెంచడానికి ప్రభుత్వం చర్యలు..
జననాల రేటు బాగా తగ్గిపోవడంతో పలు చర్యలు తీసుకుంటోంది చైనా ప్రభుత్వం. అందులో భాగంగా యువత పెళ్లిళ్లు చేసుకోవాలని, పిల్లలను కనాలని ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు చేసుకున్న వారికి, పిల్లలను కనేవారికి.. భారీగా ప్రోత్సాహకాలు, రాయితీలు, నగదు బహుమతులు ఇస్తామని అనేక ప్రకటనలు చేసింది. అంతేకాకుండా కండోమ్లు, ఇతర గర్భనిరోధక సాధనాలపై భారీగా పన్ను విధించి.. ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలని భావించింది. అందుకే వీటన్నింటిపై వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను 13 శాతం విధించాలని నిర్ణయం తీసుకుంది. మరి జనాభా పెరుగుదల కోసం చైనా తీసుకుంటున్న చర్యలు ఏ మేర ఫలిస్తాయో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa